తెలంగాణా ఎన్నికల బరిలో నందమూరి హరికృష్ణ కుమార్తె?...కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీ!
హైదరాబాద్:ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారా?...అంటే అవుననే అంటున్నాయి టిటిడిపి శ్రేణులు. తెలంగాణా ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని పోటీ చేయించాలని టిటిడిపి ముఖ్య నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నందమూరి సుహాసినీని కూకట్పల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్న టిటిడిపి ఈ ప్రతిపాదనను ఇప్పటికే తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. టిటిడిపి నేతల ప్రతిపాదనపై తానా ఆలోచిస్తానని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారట. ఒకవేళ నందమూరి సుహాసిని అభ్యర్థిత్వానికి టిడిపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి పోటీ చేసిన మరొక వ్యక్తి ఆమే అవుతారు.
ఎన్నికల బరిలో...నందమూరి సుహాసినీ
నందమూరి సుహాసినీ కుటుంబానికి ఎన్టీఆర్ మనవరాలు, నందమూరి హరికృష్ణ కుమార్తెగానే కాదు...భర్త తరుపు నుంచి కూడా రాజకీయ వారసత్వం ఉండటం విశేషం. గమనార్హం. నందమూరి సుహాసిని భర్త చుండ్రు శ్రీకాంత్ మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు కావడం గమనార్హం. నందమూరి సుహాసినీని కూకట్ పల్లి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దింపాలని తాము యోచిస్తున్నది నిజమేనని ఒక టిటిడిపి నేత ఆంధ్రజ్యోతి పత్రికకు తెలిపారు.
కూకట్ పల్లి...టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి
కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే బాగుంటుందని తాము భావిస్తున్నామని...ఆ క్రమంలో హరికృష్ణ కుమారుడు కళ్యాణ్రామ్ లేదా కూతురు సుహాసినిని పోటీ చేయించే విషయమై పార్టీలో చర్చించామని ఆయన చెప్పారు. అయితే ఎన్నికల బరిలో దిగేందుకు కళ్యాణ్రామ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో నందమూరి సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించామని ఆయన ఆ పత్రికకు వెల్లడించారట.
ఆ స్థానానికి...తీవ్రమైన పోటీ
ఇదిలావుంటే టిడిపి నుంచి కూకట్పల్లి స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొని ఉండటం గమనార్హం. ఎపి నుంచి వలస వచ్చి స్థిరపడినవారు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉండటం కూడా దీనికి మరో కారణం. కూకట్పల్లి ఎమ్మెల్యేగా తానే పోటీ చేయబోతున్నట్లు టిటిడిపి సీనియర్ లీడర్ పెద్ది రెడ్డి గత కొన్ని రోజులుగా స్థానిక పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారట. మరోవైపు మందాడి శ్రీనివాసరావు ఇక్కడ బరిలోకి దిగేది తానేనంటూ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేయడంతో ఈ స్థానంపై స్థానిక నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ ఇరువురు నేతలు ఇక్కడ మూడురోజుల కిందట భారీ ర్యాలీలు నిర్వహించడం విశేషం.
చంద్రబాబుకు...అనేక వినతులు
అయితే అసలు కూకట్పల్లి ఎమ్మెల్యే సీటును బీసీలకు ఇవ్వాలని టిటిడిపిలోని బిసి నేతలతో పాటు బిసి సంఘాలు కూడా చంద్రబాబును కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీటును కాపులకు కేటాయించాలని ఏపీకి చెందిన కొంతమంది కాపు నేతలు కూడా చంద్రబాబుని కలసి కోరారని అంటున్నారు. అంతేకాదు అధికారపార్టీ టిఆర్ ఎస్ కూకట్పల్లి కార్పోరేటర్ కావ్యారెడ్డి భర్త హరీశ్ రెడ్డి మంగళవారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి కూకట్ పల్లి టిడిపి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలని కోరారనే వార్త కలకలం రేపింది.
ఆ స్థానాలపై...ఉత్కంఠ
ఇక మరోవైపు చూస్తే మహా కూటమి టీడీపీకి ఇంకా నాలుగు స్థానాలను ప్రకటించాల్సివుండటంతో అవేమిటనే విషయమై ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ టిటీడీపీ ముఖ్య నేతల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం కూకట్పల్లి తో పాటు రాజేంద్రనగర్ టిడిపికే కేటాయించనుండగా...బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, ఖైరతాబాద్, సనత్నగర్, ఎల్బీనగర్,ఇబ్రహీంపట్నం ఈ ఆరు స్థానాల్లో ఏవైనా మూడు టీడీపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.