కన్నీటి వీడ్కోలు: మహా ప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
Recommended Video
హైదరాబాద్: నార్కట్పల్లి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. అంతకుముందు అంతిమయాత్రలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, లోకేష్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాడె మోశారు.
అంతిమయాత్రకు భారీ సంఖ్యలో అభిమానులు, నేతలు తరలివచ్చారు. మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. మరికాసేపట్లో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరిగాయి.
దాదాపు గంటన్నరపాటు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానం చేరుకున్న తర్వాత హరికృష్ణ పార్థీవదేహంపై టీడీపీ జెండాను కప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు కడసారి నివాళులర్పించారు. అనంతరం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్.. హరికృష్ణ పార్థీవ దేహం చుట్టూ ప్రదిక్షణలు చేశారు.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్.. హరికృష్ణ చితికి నిప్పుపెట్టారు. కన్నీటి వీడ్కోలు పలికారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్,తుమ్మల నాగేశ్వరరావు, ఏపీమంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు అంతిమయాత్ర వాహనంలో హరికృష్ణ భౌతికకాయం పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిల్చున్నారు. మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిలబడ్డారు. ముందు ఇరువైపులా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉండగా, చంద్రబాబు పక్కన బాలకృష్ణ ఉన్నారు. టీడీపీ నేతలతో కలసి నారా లోకేష్ వాహనం ముందు నడిచారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహాప్రస్థానంలో నివాళులర్పించారు. అంతిమయాత్ర నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఆయా మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు.