హరికృష్ణకు తెలంగాణ మరో గౌరవం, 450 గజాలలో ప్రభుత్వ నిధులతో స్మారకచిహ్నం
Recommended Video
హైదరాబాద్: నందమూరి హరికృష్ణకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం గురువారం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. హరికృష్ణ అంత్యక్రియలు జరిగిన మహాప్రస్థానం పరిసరాల్లో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా 450 గజాల స్థలాన్ని కేటాయించింది.
హరికృష్ణకు తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవం
అంత్యక్రియల అనంతరం హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి నిర్ణయం మేరకు హరికృష్ణ స్మారకచిహ్నాన్ని నిర్మించనున్నారు. ఈ స్మారకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిధులతోనే నిర్మించనున్నారు. నందమూరి కుటుంబంపై తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ అంటే తనకు ఎంత అభిమానమో కేసీఆర్ పలుమార్లు చెప్పారు. ఎన్టీఆర్ పేరును తన కొడుకు కేటీఆర్కు పెట్టుకున్నారు.
అంత్యక్రియల్లో మంత్రి తలసాని
హరికృష్ణ అంత్యక్రియలు బుధవారం ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య హరికృష్ణ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హరికృష్ణ చితికి ఆయన రెండో కొడుకు కల్యాణ్ రామ్ నిప్పంటించారు. మెహిదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. హరికృష్ణ అంత్యక్రియల్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
స్మారక చిహ్నంపై మంత్రి
హరికృష్ణ అంత్యక్రియల్లో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. రాజకీయ నేతలు, అభిమానులు, సెలబ్రిటీలతో మహాప్రస్థానం పరిసరాలు కిక్కిరిసి పోయాయి. అంత్యక్రియల సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... మహా ప్రస్థానం పరిసరాల్లో హరికృష్ణ స్మారక చిహ్నానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. సుమారు 450 గజాల్లో దీనిని ప్రభుత్వమే స్వయంగా నిర్మిస్తుందన్నారు.
ఉద్వేగభరిత వాతావరణం
అంతిమయాత్రలో, అంత్యక్రియల సమయంలో ఉద్వేగభరిత వాతావరణం కనిపించింది. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. చితికి నిప్పు అంటించడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గాలిలోకి కాల్పులు జరిపారు.