ఏపీలో ప్రచారానికి నందమూరి సుహాసిని సిద్ధం, టీడీపీ వెంటే కుటుంబం
హైదరాబాద్/గుంటూరు: తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోను ప్రచారం చేస్తానని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని అన్నారు.
ఆమె గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ కుటుంబం తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరిస్తుందని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్పల్లి నుంచి బరిలోకి దిగిన సుహాసిని ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడినా తాను కూకట్పల్లి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు బహిరంగ లేఖ రాశారు కూడా. మరోవైపు, సుహాసిని టీఆర్ఎస్లో చేరబోతున్నారని, కేసీఆర్ చెబుతున్న రిటర్న్ గిఫ్ట్ అదేననే ప్రచారం జరిగింది. కానీ సుహాసిని మాత్రం టీడీపీతోనే తమ కుటుంబమని చెప్పింది.