ఓడించినా సరే!: కూకట్పల్లి ప్రజలకు నందమూరి సుహాసిని బహిరంగ లేఖ
కూకట్పల్లి: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీ చేసి ఓడిపోయిన నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఆ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండి, సేవ చేస్తానని పేర్కొన్నారు.
సుహాసిని ఏం రాశారంటే?
'కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలందరికీ నన్ను అతి తక్కువ కాలంలోనే ఆదరించి, అక్కున చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నన్ను ఆధరించిన కూకట్పల్లి నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇక్కడే (కూకట్పల్లి) ఉండి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాను. ఈ ఎన్నికలలో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఇట్లు నందమూరి సుహాసిని' అని అందులో పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ పరిధిలో వారసులుగా బరిలోకి దిగిన వారిలో సుహాసినితో పాటు మరికొందరు ఓటమి చవి చూశారు. వీరేందర్ గౌడ్, విష్ణువర్ధన్, అనిల్ కుమార్లు ఓడిపోయారు.
గట్టిపోటీ ఇచ్చి నలుగురు ఓడిపోయారు
వారసులుగా వచ్చి గెలవాలని పలువురు బరిలోకి దిగారు. పై నలుగురు ఓడిపోయినప్పటికీ గెలిచిన వారికి గట్టి పోటీ ఇచ్చారు. సుహాసినితో పాటు పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్లు పోటీ చేసి ఓడిపోయారు.
జూబ్లీహిల్స్ నుంచి విష్ణు
గత ఎన్నికల్లో ఓటమి పాలైన విష్ణువర్థన్ రెడ్డి ఈసారి కూడా గెలవలేదు. పీజేఆర్ హఠాన్మరణంతో రాజకీయారంగేట్రం చేసిన విష్ణు 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన జూబ్లీ హిల్స్ నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడూ పరాజయం పాలయ్యారు.
ఉప్పల్ నుంచి వీరేందర్ గౌడ్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ను ఓటర్లు మళ్లీ తిరస్కరించారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన అతను, ఈసారి ఉప్పల్ నుంచి బరిలోకి దిగారు. రెండోసారి కూడా ఓటమి చవి చూశారు. ప్రత్యర్థికి మాత్రం గట్టి పోటీ ఇచ్చారు.
ముషీరాబాద్ నుంచి అనిల్
యువజన కాంగ్రెస్ నేత, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అయిన అనిల్ కుమార్ యాదవ్కు కూడా ఈ ఎన్నికలు నిరాశను మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసిన అనిల్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు గట్టి పోటీనిచ్చారు.