'తెలంగాణ ప్రజలకు నమస్కారం.. మీ సుహాసిని': జూ.ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అంటే ఏం చెప్పారంటే?
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ణ కూతురు, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ల సోదరి నందమూరి సుహాసిని బరిలో నిలుస్తున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
ఆదిలోనే దెబ్బ: సుహాసిని గో బ్యాక్ అంటూ కూకట్పల్లిలో నినాదాలు, కారణమిదే
'నా తెలంగాణ ప్రజలందరికీ.. మీ ఇంటి ఆడబిడ్డగా, నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ ప్రసంగం.. మీ నందమూరి సుహాసిని' అంటూ ఆమె తన మీడియా సమావేశాన్ని ప్రారంభించారు. తన పైన నమ్మకం ఉంచి, తాను ప్రజలకు సేవ చేస్తానని నమ్మి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున తనకు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీటును కేటాయించారని, అందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు.
వారి స్ఫూర్తిగా రాజకీయాల్లోకి
మా తాతగారు ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేయాలని టీడీపీని స్థాపించారని, తన తండ్రి హరికృష్ణ తన తాతకు రథసారథిగా పని చేసి, ప్రజలకు చేరువ అయ్యారని సుహాసిని గుర్తు చేశారు. నా చిన్నప్పటి నుంచి లక్షలసార్లు ప్రజలే మన దేవుళ్లు, వారికి ఎల్లప్పుడూ సేవ చేయాలని వారు తనకు చెప్పేవారని, దానిని స్పూర్తిగా తీసుకొని, తనవంతు సేవ చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పారు.
మీ ఆశీర్వాదాలు కావాలి
దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని సుహాసిని తెలంగాణ ప్రజలను, కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలను కోరారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయగా.. రేపు (శనివారం తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని, అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుతానని, అందరికీ సమాధానం చెబుతానని అన్నారు.
చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి
తనకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఆసక్తి అని సుహాసిని చెప్పారు. మా తాత, మా నాన్నను చూసి స్ఫూర్తి కలిగిందని, ఆ తర్వాత తన మామ చంద్రబాబు చూసి కూడా రాజకీయాల్లోకి దిగాలని అనుకున్నానని చెప్పారు. ఆ కోరిక ఇవాళ నెరవేరిందని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తానని అన్నారు.
ప్రచారానికి జూ.ఎన్టీఆర్ వస్తారా అంటే
తన మామ శ్రీహరి మాజీ పార్లమెంటు సభ్యుడు అని, ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేశారని, ఆయన స్ఫూర్తి కూడా ఉందని సుహాసిని చెప్పారు. ప్రచారానికి జూ.ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు వస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... రేపు నామినేషన్ వేశాక అన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు. నామినేషన్ సమయం నిర్ణయించలేదన్నారు.
తెరాస ప్రభుత్వంపై ప్రశ్నిస్తే
ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని సుహాసిని చెప్పారు. తన స్ఫూర్తి తన తాత, తండ్రి, మామ చంద్రబాబు అని మరోసారి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తెరాస ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె స్పందిస్తూ.. రేపు అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు.