తెలుగులో తడబాటుపై నందమూరి సుహాసిని ఏం చెప్పారంటే? హరికృష్ణ కోడలు ప్రచారం
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారంలో భాగంగా తెలుగులో స్పష్టంగా మాట్లాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాను పోటీ చేస్తున్నానని చెప్పిన మొదటి రోజునుంచి ఆమె తెలుగులో తడబడుతున్నట్లుగా ఉంది.
'నందమూరి సుహాసినికి భారీ మెజార్టీ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అసత్యపు ప్రచారం'
ఏదో బట్టీపట్టిన వారిలా చెబుతున్నారని సోషల్ మీడియాలోను విమర్శలు వచ్చాయి. నియోజకవర్గంలో ప్రచారం సమయంలోను ఆమె ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. మొత్తంగా మీడియా సమావేశంలో, ప్రచారంలో ఇబ్బందులు పడుతుండటంపై తనను కలిసిన మీడియాతో ఆమె స్పందించారు.
అందుకే తెలుగులో మాట్లాడటంలో సమస్య
తాను తెలుగు భాషను చాలా అనర్గళంగా మాట్లాడగలనని నందమూరి సుహాసిని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పదజాలం, భాష తనకు ఇంకా అలవడలేదని చెప్పారు. మీడియా సమావేశాలు, బహిరంగ సభలలో ఇంగ్లీష్ పదాలు వాడకూడదని చెప్పడంతో ఈ సమస్య తలెత్తిందని ఆమె అన్నారు. తామంతా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటామని చెప్పారు. తన చదువంతా హైదరాబాదులోనే కొనసాగిందని చెప్పారు.
సుహాసిని అందుకేనా
ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే తెలుగులో మాట్లాడుతుండగా ఏదైనా ఇంగ్లీష్ పదం వస్తుందా అనే భావనతో పూర్తి తెలుగులో మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మనం తెలుగులో మాట్లాడే సమయంలో అక్కడక్కడా ఆంగ్ల పదాలు దొర్లుతుంటాయి. పలువురు రాజకీయ నాయకులు తెలుగులోనే మాట్లాడాలని సూచించడం, తన నోటి నుంచి ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయా అని ఆమె తరిచి చూసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
సుహాసిని తరఫున జానకిరామ్ సతీమణి ప్రచారం
ఇదిలా ఉండగా నందమూరి సుహాసిని తరఫున ప్రచారానికి ఆమె కుటుంబం రంగంలోకి దిగింది. దివంగత నందమూరి జానకిరామ్ సతీమణి దీపిక కూకట్పల్లిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ఆడపడుచు సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్నారని, నందమూరి హరికృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేసేందుకు ఆమె ముందుకు వచ్చారని ఆమె చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆమె భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.
బొట్టుపెట్టి ప్రచారం
తాము గడపగడపకూ బొట్టుపెట్టి ప్రచారం చేస్తున్నామని దీపిక చెప్పారు. తాము పదిరోజులుగా ప్రచారం చేస్తున్నామని, ప్రజల స్పందన బాగుందని చెప్పారు. నందమూరి కుటుంబానికి ప్రజల్లో ఉన్న గౌరవం మరోసారి అర్థమైందన్నారు. సుహాసినికి అనుభవం లేకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉన్నాయని, ఆమె 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.