ఆ డీసీపీ, ఏసీపీ వద్దు: ఈసీకి నందమూరి సుహాసిని ఫిర్యాదు, డబ్బు దొరకలేదని జూపూడి
హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ పోలీసు అధికారులను బదలీ చేయండి
మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు, కూకట్పల్లి ఏసీపీ సురేంద్ర టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సుహాసిని ఫిర్యాదు చేశారు. వారిని బదలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను కూడా తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్, పాత బోయినపల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని సుహాసిని కోరారు.
కావాలనే చేస్తున్నారు.. జూపూడి
మరోవైపు, తన ఇంటివద్ద నగదు దొరికిందనే ఆరోపణలపై ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ బుధవారం స్పందించారు. కూకట్పల్లి బాలాజీనగర్లోని తన నివాసంలో ఈసీ అధికారులు తనిఖీలు చేశారని, అయితే ఎలాంటి నగదు లేదని వెళ్లిపోయారన్నారు. ఇలా ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారో తెలియట్లేదన్నారు. తాము ఎక్కడ బతకాలో తెలియడం లేదని అన్నారు. బంధువుల్ని కూడా తమ ఇంట్లోకి రానీయడం లేదన్నారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలని, ఇంట్లో తన భార్య తప్ప ఎవరూ లేరన్నారు. కావాలనే చేస్తున్నారని, ఇది తెరాస ప్రభుత్వానికి సరికాదన్నారు.
తనిఖీలు.. పట్టుబడ్డ రూ.23 లక్షలు
ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వరంగల్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తరలిస్తున్న రూ.23 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి స్థానిక పోలీసులు కాశీబుగ్గ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. బైక్ పైన వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను తనిఖీ చేశారు. వారి వద్ద నగదు పట్టుబడింది.
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు
పరకాల నియోజకవర్గంలోని మొగిలిచర్లలో ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండకు చెందిన టీఆర్ఎస్ నేత ఈ డబ్బును అందించినట్లు వారు చెప్పారని పోలీసులు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశామని చెప్పారు.