బీజేపీకి షాక్: తిరిగి సొంత గూటికి పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్
హైదరాబాద్: పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్గౌడ్ సొంతగూటికి చేరనున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయమై శనివారం హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో నందీశ్వర్గౌడ్ కలిశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో మళ్లీ చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్ ముఖ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరిక లాంఛనప్రాయం కానుంది.
సోమవారమే పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చి గాంధీభవన్లో కాంగ్రెస్లో చేరాలని నందీశ్వర్గౌడ్ నిర్ణయించుకున్నారు. కాగా, నందీశ్వర్గౌడ్ కాంగ్రెస్లో ఉన్నపుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్కు అనుంగు శిష్యుడిగా గుర్తింపు పొందారు.
డీఎస్ టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆయన బీజేపీలో చేరారు. అయితే డీఎస్ మళ్లీ కాంగ్రెస్లోకి వస్తున్నారనే సంకేతాల నేపథ్యంలో ఆయన సూచన మేరకే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్లో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, సెప్టెంబర్ 12న రాహుల్ సమక్షంలో డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. గత కొద్ది కాలంగా డీ శ్రీనివాస్ను టీఆర్ఎస్ దూరం పెడుతున్న విషయం తెలిసిందే.