బాబును పిలువలేదని అలిగిన గరికపాటి: నందిని సిధారెడ్డి నిప్పులు
హైదరాబాద్: సహస్రావధాని గరికపాటి నరసింహారావుపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వానాన్ని గరికపాటి తిరస్కరించడంపై ఆయన మండిపడ్డారు.
మహాసభలు ఎలా నిర్వహించాలో, ఎలా చేయాలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఎదురు దాడి చేశారు. మీ కోసం సభలు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన గరికపాటిని ఉద్దేశించి అన్నారు.
మేం అనుకున్నది ఇలా..
ప్రపంచ తెలుగు మహాసభల్లో తాము గౌరీభట్ల మెట్టురామశర్మ అవధానం వినాలనుకున్నామని, మళ్లీ గరికపాటి అవధానం పెడితే మెట్టురామశర్మ ఎటు పోతాడని సిధారెడ్డ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Recommended Video
చంద్రబాబును పిలువలేదని...
ప్రపంచ తెలుగు మహాసభలకు రావాలని తనకు పంపిన ఆహ్వానాన్ని సహస్రావధాని గరికపాటి నరసింహారావు తిరస్కరించి, సభలకు హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన సభలను బహిష్కరించారు.
కుటుంబ పెద్దను పిలువకుండా..
కుటుంబ పెద్దను పిలవకుండా తమలాంటి వారిని పిలవడం సరికాదని గరికపాటి ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు అన్నారు. తాను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అని, అందువల్ల ఏపీ ముఖ్యమంత్రినే ఆహ్వానించని పక్షంలో తాను వెళ్లడం సరికాదనే భావనతోనే తెలుగు మహాసభలకు వెళ్లలేదని ఆయన అన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసిన తర్వాత...
గరికపాటి వ్యాఖ్యపై ప్రపంచ తెలుగు మహాసభల్లో గానీ, అంతకు ముందు గానీ గరికపాటి వ్యాఖ్యలపై సిధారెడ్డి స్పందించలేదు. మహాసభలు ముగిసిన తర్వత గరికపాటిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.