కెసిఆర్పై నఖ్వీ తీవ్ర వ్యాఖ్యలు: స్టాలిన్ మద్దతు
ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదనను కేంద్ర ంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. అయితే, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాత్రం కెసిఆర్కు మద్దతు
హైదరాబాద్/ చెన్నై: ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిపాదనను కేంద్ర ంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. అయితే, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాత్రం కెసిఆర్కు మద్దతు ప్రకటించారు.
ముస్లింలకు బిసి కోటా పెంచి రిజర్వేషన్స్ పెంచుతామనే కెసిఆర్ ఆలోచన ముందుకు సాగేది కాదని నఖ్వీ అన్నారు. ముస్లింలకు కెసిఆర్ లాలీపాప్ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యంగ పరిధిలో మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, అందువల్ల కెసిఆర్ హామీ అమలు కాబోవని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ శాసనసభ ఏప్రిల్లో బిల్లును ఆమోదించింది. బిజెపి తప్ప అన్ని పార్టీలు ఆ బిల్లుకు మద్దతు తెలిపాయి.
ఇదిలావుంటే, రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకే ఉండాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ధర్నా విజయవంతం కావాలని స్టాలిన్ ఆకాంక్షించారు. కేసీఆర్ ధర్నాకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తరఫున తాను సంఘీభావం తెలుపుతున్నట్లు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సామాజిక న్యాయం కోసం దేశంలోనే తొలిసారి పిలుపునిచ్చిన ఘనత డీఎంకేకు దక్కుతుందని, మైనారిటీలు, బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలని తాము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం డీఏంకే జరిపిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా తమిళనాట విద్య, ఉపాధి అవకాశాల్లో 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని స్టాలిన్ తెలిపారు.