రెచ్చగొడ్తున్నారు.. పవన్ కళ్యాణ్ను కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేం సెకండ్: లోకేష్
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని తాను చెప్పడం లేదని, కానీ కొందరు రెచ్చగొడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు.
అక్వా ఫుడ్ పార్క్ విషయంలో ప్రజలను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొడుతున్నారని జగన్ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఓ పార్టీ పెట్టుకున్నారని, ఆయన సమస్యల పైన మాట్లాడవచ్చునని చెప్పారు. అందులో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డారు.
అక్వా బాధితులు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా చెప్పారన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన చెప్పారన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా అదే చేస్తామని చెప్పారన్నారు. పవన్తో విభేదాలు లేవన్నారు. కాలుష్యం లేకుండా పైపులను వేస్తామని చెప్పారన్నారు.
ఎవరైనా మంచి సూచనలు చేస్తే తప్పకుండా తీసుకుంటామని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ కొందరు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. రాజధాని, పట్టిసీమ ఇలా అన్నింటా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
కంపెనీలు లేకుండా ఉద్యోగాలు రావని చెప్పారు. అన్నింటికి అడ్డుపడితే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కొంతమంది ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. తాను పవన్ అలా చేస్తున్నారని అనడం లేదన్నారు. కొందరు చేస్తున్నారని చెప్పారు. తూగోలో 40 ఫ్యాక్టరీలు ఉన్నాయని, అక్వా కొత్తదేం కాదన్నారు.
పట్టసీమ వల్ల కరువు రాలేదు
పట్టిసీమ ప్రాజెక్టు లేకుంటే రాయలసీమకు నీరు ఇవ్వలేకపోయేవాళ్లమన్నారు. కృష్ణాకు నీటిని ఇచ్చామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో లాభం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. పట్టిసీమ లేకుంటే డెల్టాలో కరువు వచ్చేదన్నారు. 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని చెప్పారు. ఎవరికైనా అర్హులకు రాకుంటే పోరాడి సాధించుకోవాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదలు వచ్చి, తగ్గాగ జగన్ వెళ్లారని, అప్పటికే చంద్రబాబు మూడుసార్లు పర్యటించారన్నారు.
తెలంగాణలో బలంగా ఉన్నాం
గత ఏడాది టిడిపి సభ్యత్వం యాభై లక్షలకు పైగా ఉంది. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. గత ఏడాది సభ్యత్వం చేస్తే చాలునని చెప్పారు. తెలంగాణలో తమ బలం తగ్గలేదని, ఎమ్మెల్యేలు మాత్రం తెరాసలోకి వెళ్లారన్నారు. పార్టీ బలంగా ఉందని చెప్పారు. తెలంగాణలో తమ పార్టీకి ఆదరణ ఉందని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు ఉందని, అప్పుడే అన్నింటి గురించి ఏం మాట్లాడలేమని అభిప్రాయపడ్డారు. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తాము ఒకటే సీటు గెలిచినప్పటికీ, ఏడున్నర లక్షల ఓట్లు సాధించామని చెప్పారు. మజ్లిస్ సహా ఏ పార్టీకి అన్ని ఓట్లు రాలేదన్నారు. తెరాస తర్వాత తమదే ఉందన్నారు.