సహకారం: ప్రత్యూష ఉదంతం విని కదిలిపోయిన నారా లోకేష్
హైదరాబాద్: తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై, గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పందొమ్మిదేళ్ల యువతి ప్రత్యూష అంశంపై తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శుక్రవారం నాడు స్పందించారు. ఆమెను సహకరించేందుకు ముందుకు వచ్చారు.
ప్రత్యూషకు ఎందరో ఉన్నప్పటికీ ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం పైన హైకోర్టు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యూషను ఆదుకుంటామని చెబుతు ముందుకు వస్తున్నారు. ప్రత్యూషను తాను చూసుకుంటానని పోసాని కృష్ణ మురళి చెప్పారు.
తాజాగా నారా లోకేష్ స్పందించారు. ప్రత్యూష విషయం తనను కదిలించిందని నారా లోకేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. తన వాళ్ల నుండే ఆమెకు వేధింపులు రావడం బాధించిందన్నారు. ఆమెకు తమ ట్రస్ట్ (ఎన్టీఆర్ ట్రస్ట్) నుండి, వ్యక్తిగతంగాను సహకరిస్తానని చెప్పారు.
నారా లోకేష్ స్పందన పైన పలువురు ప్రతిస్పందించారు. నారా లోకేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని రీట్వీట్లు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమెకు సహకరించాలని మరొకరు రీట్వీట్ చేశారు. ప్రత్యూషకు సాయంచేసేందుకు పలువురు ముందుకు రావడం గమనార్హం.