బాబ్రీ విధ్వంసం: పివీపై బురదజల్లిన తరుణ్ గోగోయ్
'బాబ్రీ మసీదు..' సున్నితమైన భావోద్వేగాలతో ముడి వేసుకున్న అంశం. తాజాగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు అసోం సీఎం తరుణ్ గోగోయ్. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న హయాంలో ఆహార శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ అలసత్వ ధోరణితో వ్యవహరించారంటూ ఆరోపణలు చేశారు.
తన రాజకీయ అనుభవాలను ప్రస్తావిస్తూ.. 'టర్న్ ఎరౌండ్ లీడింగ్-ఫ్రమ్ ద ఫ్రంట్' అనే పుస్తకాన్ని రాసిన తరుణ్ గోగోయ్, 1992 డిసెంబర్ లో బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ వ్యవహరించిన తీరుపై పుస్తకంలో విమర్శలు గుప్పించారు. పీవీకి పార్టీ మీద అంతగా పట్టు లేదని పుస్తకంలో చెప్పుకొచ్చిన ఆయన, మైనారిటీ నేతలను కూడా దృష్టిలో పెట్టుకుని పీవీ వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బాబ్రీ కూల్చివేత తర్వాతే పార్టీకి మైనారిటీలు దూరమయ్యారని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే బాబ్రీ కూల్చివేతపై మంత్రిగా తనకున్న పరిధులను దాటి మరీ అప్పట్లో పీవీకి లేఖ రాశానని కానీ ఆయన సరైన రీతిలో స్పందించలేదని పుస్తకం ద్వారా స్ఫష్టం చేశారు.
అయితే పీవీ గురించి పలు విషయాల్లో ప్రశంసలు కూడా కురిపించారు తరుణ్ గోగోయ్. పీవీ చాలా ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అని, ప్రధానిగా ఎన్నో కొత్త సంస్కరణలకు ఆయన నాంది పలికారని తెలిపారు. మంత్రుల విషయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని, ఆహార శాఖ మంత్రిగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్చను ఇచ్చారన్నారు.
ఇక అప్పట్లో మంత్రిగా తన పనితీరు గురించి తెలియజేస్తూ, కోకా కోలా, పెప్సీ లాంటి బహుళ జాతి కంపెనీలను దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేసింది తానేనని, దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. కాగా.. తరుణ్ గోగోయ్ 2001 నుంచి ఇప్పటి వరకు అసోం సీఎంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.