పీవీ కూల్చివేత యత్నాలు జరిగాయి: హాఫ్ లయన్లో సంచలనం
ఢిల్లీ: మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహా రావు పైన కాంగ్రెస్ పార్టీ నిర్దయగా వ్యవహరించిందని, ముస్లీంల ఓట్లను ఆకట్టుకునేందుకు ఆయన పైన నింద మోపిందని 'హాఫ్ లయన్' పుస్తకంలో రచయిత వినయ్ సీతాపతి ఆరోపించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో పీవీ పాత్రను ఆయన సమర్థించారు. కూల్చివేత చర్యలను పీవీ ఉద్దేశ్యపూర్వకంగా నిలువరించలేదనే ఆరోపణలు సరికాదని ఆ పుస్తకంలో అభిప్రాయపడ్డారు. హాఫ్ లయన్ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీతాపతి మాట్లాడారు. బాబ్రీ కూల్చివేతతో పాటు పీవీ కూల్చివేత యత్నాలు జరిగాయన్నారు. ముస్లీం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ పీవీ పైన నింద మోపిందన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ తీవ్రంగా స్పందించారు.
ముప్పును గుర్తించేలా ప్రధానిని మేల్కొలిపేందుకు తాము ప్రయత్నించటామని, ఆయన తిరస్కరించారని విమర్శించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... పీవీ దేశానికి చేసిన మంచి ఆయన తర్వాత కూడా సజీవంగా ఉందన్నారు. కూల్చివేత సమయంలో పీవీలోని సంశయాల్ని రాజ్యాంగపరమైన అంశాలు కాకుండా రాజకీయాలు ప్రేరేపించాయన్నారు.