బాబును పిలిచా, ప్రోటోకాల్ తప్పను: గవర్నర్, నీటి గొడవపై దాటవేత
హైదరాబాద్: తాను ఇఫ్తార్ విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించానని, తాను ఎప్పుడు కూడా ప్రోటోకాల్ తప్పబోనని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. రాజభవన్లో ఆయన శుక్రవారం సాయంత్రం రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల గౌరవార్థం ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరు కాగా, చంద్రబాబు గైర్హాజరయ్యారు. చంద్రబాబు గుంటూరులో ప్రభుత్వం తరఫున ఏర్పటైన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మంత్రి వర్గ సమావేశం వల్ల, గుంటూరులో ప్రభుత్వ ఇఫ్తార్ విందు వల్ల చంద్రబాబు రాలేకపోయారని గవర్నర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య రగులుతున్న జలవివాదంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఇరు రాష్ట్రాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, ఇరు రాష్ర్టాల మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఏసీబీ డీజీ ఏకేఖాన్, ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.