'దిక్కున్న చోట చెప్పుకో.. ఎందుకు బతికున్నావ్.. చచ్చిపో': నారాయణలో మరో దారుణం..
ఇటీవల లెక్చరర్ కీర్తి నుంచి ఆమెకు తీవ్ర వేధింపులు ఎదురవుతుండటంతో మంగళవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు యత్నించింది.
Recommended Video
హైదరాబాద్: ఆత్మహత్యలు.. విద్యార్థులపై వేధింపులతో నారాయణ కాలేజీ నిత్యం వార్తల్లో నానుతూనే ఉంది. ఎన్ని కేసులు నమోదైనా.. ఎంత మంది ఫిర్యాదులు చేస్తున్న.. ప్రభుత్వాలు మాత్రం ఆ కాలేజీల వైపు కన్నెత్తి చూడటం లేదు.
'సత్యభామ'లో హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య, 'మిస్ యూ ఆల్' అంటూ మెసేజ్
వెరసి అమాయక విద్యార్థులు బలైపోతున్న పరిస్థితి. చదువుల ఒత్తిళ్లు తాళలేక బలైపోతున్నవారు కొందరైతే.. యాజమాన్యం, లెక్చరర్ల తీరుతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నవారు మరికొందరు. తాజాగా నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఎవరా అమ్మాయి?:
ఖమ్మం జిల్లా కొత్తగూడెం గాంధీనగర్కు చెందిన విద్యార్థిని నవ్యశ్రీ గౌడ్ (16) కూకట్పల్లి వెంకట్రావ్నగర్ సమీపంలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.
చదువులో చురుగ్గా ఉండే విద్యార్థినిపై ఇటీవల ఓ లెక్చరర్ కక్ష కట్టింది. చీటికి మాటికి దూషించడం, ఆఖరికి పరీక్షల్లోను ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులు వేసి వేధించడం చేసింది. దీంతో సదరు విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి లోనైంది.
విద్యార్థినిపై లెక్చరర్ కక్ష:
క్లాస్ జరుగుతున్న సమయంలో స్నేహితులతో మాట్లాడిందన్న కోపంతో నవ్యశ్రీపై మేథమెటిక్స్ లెక్చరర్ కీర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా మందలించడంతో నవ్యశ్రీ నొచ్చుకుంది. ఆ తర్వాత జరిగిన పరీక్షల్లోను నవ్యశ్రీపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించింది. కావాలనే మార్కులు తక్కువ వేసి విద్యార్థినిని ఆందోళనకు గురయ్యేలా చేసింది.
'కడుపునకు గడ్డితింటున్నావా?':
తాను పరీక్ష బాగానే రాసినా.. తక్కువ మార్కులు రావడంపై నవ్యశ్రీ లెక్చరర్ కీర్తిని ప్రశ్నించింది. దీంతో విద్యార్థినిపై కీర్తి మరింతగా కోపం పెంచుకుంది.
' కడుపునకు గడ్డితింటున్నావా? మట్టి తింటున్నావా? ఎందుకు బతికున్నావ్.. చచ్చిపో! నా వెనుక ప్రిన్సిపాల్ ఉన్నారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో' అంటూ విద్యార్థినిని దూషించింది.
ఆత్మహత్యాయత్నం:
లెక్చరర్ తనను తీవ్రంగా దూషించడంతో నవ్యశ్రీ తీవ్రంగా కలత చెందింది. సోమవారం ఉదయం బ్లేడుతో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థిని తండ్రికి సమాచారం అందించడంతో.. ఆమె తండ్రి కాలేజీకి వచ్చి లెక్చరర్ కీర్తి, ప్రిన్సిపాల్ చంద్రికను నిలదీశారు. అయినా వారి నుంచి నిర్లక్ష్య సమాధానమే ఎదురైంది. దీంతో మంగళవారం లెక్చరర్ కీర్తిపై ఆయన కేసు నమోదు చేశారు.
లెక్చరర్ కీర్తి, ప్రిన్సిపాల్ చంద్రికపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె లాగే ఎంతోమంది విద్యార్థులు నారాయణ కాలేజీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.