'స్వామి గౌడ్ క్షమాపణ చెప్పాలి, కేసీఆర్ మాట్లాడరేం'
హైదరాబాద్: ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని సీపీఐ సీనియర్ నేత కే నారాయణ సోమవారం డిమాండ్ చేశారు. స్వామిగౌడ్ అలా వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్దమన్నారు. ఈ వ్యాఖఅయలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖండించకుండా ఉంటే, వాటిని సీఎం ఆమోదించారనే సంకేతాలు వెళ్తాయన్నారు.
స్వామి గౌడ్ మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేసి మత ప్రచారం చేసుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. తెలంగామ పీసీసీ అధికార ప్రతినిధిలు మల్లు రవి, మహేష్లు మాట్లాడారు. స్వామిగౌడ్ అలా వ్యాఖ్యానించే ముందు రాజ్యాంగబద్దమైన మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు.
కాగా, ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్న విషయం తెలిసిందే. లేనిపక్షంలో హిందు జాతి తగ్గిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కౌండిన్య సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మంజుల అనగానికి ఆదివారం రాత్రి బషీర్బాగ్ దేశోద్ధారకభవన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ.. చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అనే అందమైన నినాదంతో హిందూ జాతి తగ్గిపోయే ప్రమాదముందన్నారు. ఒకరు పది మంది సంతానం కంటుంటే, మరొకర్ని ఇద్దరికే పరిమితం చేయాలని కోరడం ఏం పద్ధతని ప్రశ్నించారు.
ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన వారి చరిత్రను తొక్కిపెట్టారని.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర దీనికి నిదర్శనమని చెప్పారు. జ్యోతిరావు పూలే హిందూ మతంలో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. గ్రామాల్లో నేటికీ కులవ్యవస్థ వేళ్లూనుకునే ఉందని, 60 ఏళ్ల నాటి పరిస్థితులేమీ మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.