నిద్రలోనే నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టా రెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారని చెబుతున్నారు.
హైదరాబాదులోని ఎస్సార్ నగర్లో గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్గా ఉన్నారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1989, 1999, 2009, 2014లలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మెదక్ జిల్లా గొప్ప నేతను కోల్పోయిందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కిష్టా రెడ్డి మృతి తెలిసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
కిష్టా రెడ్డి వయస్సు 57. ఆయన దివంగత నేత బాగారెడ్డి ద్వారా రాజకీయాల్లో పట్టు సాధఇంచారు. 1977లో పంచగామ సర్పంచిగా పని చేశారు. 1982లో నారాయణఖేడ్ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.