ప్రేరణగా నిలిచారు: సత్యనాదెళ్ల, సానియా మిర్జాకు 'టైమ్స్' ప్రశంస
హైదరాబాద్: ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లతో ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్లు చోటు దక్కించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నేతలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర రంగాలకు చెందిన 127 మంది పేర్లతో ఈ జాబితాను రూపొందించింది. వీరిలో 'టైమ్ 100' అని వంద మంది పేర్లతో అత్యంత శక్తిమంతుల జాబితాను వచ్చే నెలలో విడుదల చేయనుంది. పాఠకుల ఓట్ల ఆధారంగా ఈ జాబితాను టైమ్ మ్యాగజైన్ రూపొందించనుంది.
ప్రధాని మోడీ వరల్డ్ స్టేజిలో పవర్ పుల్ వాయిస్గా కొనసాగుతున్నారని టైమ్ ప్రశంసించింది. గతేడాది కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా స్వదేశంలో క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారని 'టైమ్స్' మ్యాగజైన్ కొనియాడింది.
కాగా 'క్వాంటికో' షోలో నటించడం ద్వారా ప్రియాంకా చోప్రా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారని టైమ్ పేర్కొంది. ఇక భారత సంతతికి చెందిన మైక్సోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల విండోస్ 10ను విజయవంతంగా ప్రవేశపెట్టారని, ఆయన సారథ్యంలో క్లౌడ్ టెక్నాలజీ బిజినెస్ ఊపంచుకుందని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టనున్న హొలోలెన్స్ వంటి సరికొత్త టెక్నాలజీ కోసం ఐటీ ఇండస్ట్రీ ఎనలిస్టులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టైమ్స్ వెల్లడించింది. ఆండ్రాయిడ్, యూట్యూబ్తో విదేశాల్లో కోర్ బిజినెస్ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పెంచారని కొనియాడింది.
భారత సంతతికి చెందిన హీరో అజీజ్ అన్సారీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, సింగర్ రిహన్న, జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్, హ్యారీ పోర్టర్ రచయిత్రి జేకే రౌలింగ్, అంగ్ సాన్ సూకీ, ఏంజెలా మోర్కల్, వ్లాదిమిర్ పుతిన్, పోప్ ఫ్రాన్సిస్తదితరులు 'టైమ్స్' రూపొందించిన 127 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.