కాంగ్రెస్లో గందరగోళం: టిక్కెట్ దక్కలేదని పార్టీని వీడుతున్న నేతలు, లిస్ట్లో రమ్య కూడా!
హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ దక్కని వారు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు పలువురు ఆశావహులు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
అదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మదన్ మోహన్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, మెదక్ నుంచి గాలి వినోద్ కుమార్ పేర్లను ఖరారు చేశారు.
నల్గొండ, అదిలాబాద్, భువనగిరి, సికింద్రాబాద్ వంటి స్థానాలు కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ ఉంది. ఇందులో అదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్ పోటీ చేయాలని భావించారు. కానీ టిక్కెట్ రమేష్ రాథోడ్ను వరించింది. దీంతో నరేష్ జాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదే టిక్కెట్ ఆశించిన సోయం బాబూరావు కూడా కాంగ్రెస్ పార్టీని వీడాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. పెద్దపల్లి టిక్కెట్ ఆశించిన ఆరేపల్లి మోహన్ కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట.
మరో యువనేత క్రిషాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆయన 2014లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేశారు. 2018లోను అదే టిక్కెట్ ఆశించారు. కానీ ఇవ్వలేదు. అంతేకాదు, టీపీసీసీ అధికార ప్రతినిధి రమ్య కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరనున్నట్లుగా ప్రచారం సాగుతోంది.