చావైనా బతుకైనా స్వాతితోనే: తల్లిదండ్రులకు నరేశ్ లేఖ, అదృశ్యం
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యం ఘటన మరో మలుపు తిరిగింది. అతను అదృశ్యం కావడానికి ముందు అతడు తన తల్లిదండ్రులకు రాసిన ఓ లేఖ ఒకటి వెలుగుచూసింది.
హైదరాబాద్: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యం ఘటన మరో మలుపు తిరిగింది. అతను అదృశ్యం కావడానికి ముందు అతడు తన తల్లిదండ్రులకు రాసిన ఓ లేఖ ఒకటి వెలుగుచూసింది. ఓ మీడియా ఛానల్ ఆ లేఖతో ఓ కథనం ప్రసారం చేసింది.
స్వాతి అంటే తనకు ఇష్టమని, చావైనా బతుకైనా స్వాతితోనే అంటూ నరేశ్ తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో స్పష్టం చేశాడు. తనను మోసం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. తనను నమ్మి తన తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చిన స్వాతి కోసం తాను వెళుతున్నానని.. తమ కోసం వెతకవద్దని నరేశ్ తెలిపాడు.
నరేశ్ ఎక్కడ?, స్వాతిని ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టారు: హైకోర్టు సీరియస్
ఒకరినొకరు ప్రేమించుకున్న స్వాతి, నరేశ్లు మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు. నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దు మంచిగా ఉండాలని వారికి సూచించారు. అయినా నరేష్-స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు.
15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డి చెప్పాడు. దీంతో మే 11న తిరిగి భువనగిరికి వచ్చారు. ఆ తర్వాత శ్రీనివాస్రెడ్డి తన కూతురును తన వెంట తీసుకెళ్లాడు. కాగా, అప్పటి నుంచి అంబోజు నరేష్ కనిపించడం లేదు. దీంతో తన సోదరుడిని శ్రీనివాసే ఏదో చేసి ఉంటాడని నరేశ్ సోదరి నీలిమ ఆరోపించారు.
ఇది ఇలా ఉంటే.. నరేశ్ అదృశ్యంపై నరేష్ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీల ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. కాగా, నరేశ్ అదృశ్యం కావడంతో ఆందోళనకు గురైన స్వాతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా, నరేష్ అదృశ్యం, అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్1లోగా నరేష్ జాడ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించింది. లేదంటే ఉన్నతాధికారితో విచారణ జరపించి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే అతడిని వెతికే బాధ్యతను ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించింది.
ట్విస్ట్: అత్తింటివేధింపులతోనే ఆత్మహత్య, సూసైడ్ కు ముందు స్వాతి సెల్పీ వీడియో
స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని కూడా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేగాకుండా గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతిని ఆమె తండ్రి.. ఒంటరిగా ఎందుకు వదిలి పెట్టారని నిలదీసింది. దీనిపై ప్రభుత్వ లాయర్ శరత్ సమాధానమిస్తూ... నరేష్ అదృశ్యం వెనుక స్వాతి తండ్రి ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అతని కాల్ డేటాను కూడా పరిశీలించామని చెప్పారు.