విషాదం: నిశ్చితార్థం రోజునే నేవీ ఇంజనీర్ దుర్మరణం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొద్ది గంటల్లో నిశ్చితార్థం జరుగుతుందనగా మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువకుడు మరణించాడు. ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో అతను దుర్మరణం పాలయ్యాడు.
నాగారం సత్యనారాయణ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో నివసిస్తున్న రైల్వే ఉద్యోగి విన్నకోట హరగోపాల్, దమయంతి దంపతుల కుమారుడు రాజా (26) మంగళవారం రాత్రి ప్రమాదంలో మరణించాడు. నౌకాదళంలో నేవీ ఇంజనీర్గా పనిచేస్తున్న రాజాకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. బుధవారం ఉదయం నిశ్చితార్థం జరగాల్సి ఉండింది.
కార్యక్రమానికి అవసరమైన వస్తువులను షాపింగ్ చేసేందుకు మంగళవారం సాయంత్రం హరగోపాల్, దమయంతి దంపతులు నగరానికి వచ్చారు. ఇంట్లో రాజాతో పాటు అమ్మమ్మ ఉంది. ఇంతలో ఇంట్లో ఫ్రిజ్ చెడిపోయింది. దీంతో రాజా మెకానిక్ను పిలిపించాడు. ఫ్రిజ్ను ఊడదీసి పరిశీలించిన మెకానిక్ పాడైపోయిన ఎలక్ట్రానికి వస్తువులను కొనుక్కొని రావడానికి వెళ్లాడు.
ఈలోగా అమ్మమ్మకు కాఫీ పెట్టిద్దాని వంట గదిలోకి వెళ్లిన రాజా గ్యాస్ స్టౌవ్ వెలిగించాడు. దాంతో క్షణంలో ఇంటిలో మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో జ్వాలలు చెలరేగాయి. ఆ వెంటనే పక్కనున్న మరో సిలిండర్ పేలింది. మంటలకు వంటగది కూలిపోయింది. మంటల్లో చిక్కుకున్న రాజా తీవ్రంగా గాయపడ్డారు.
ఇంట్లోని సోఫాలు, ఎల్ఈడి టీవీలతో పాటు వంట సామగ్రి తదితర వస్తువులు మంటలకు ఆహుతి అయ్యాయి. ఆ ఇంటి బయట కూర్చున్న రాజా అమ్మమ్మకు స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల అందించిన సమాచారంతో పోలీసులు, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి రాత్రి పది గంటలుకు రాజాను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజా మరణించాడు. ఫ్రిజ్ రిపేర్ చేస్తున్న సమయంలో అందులోని నైట్రోజన్ గ్యాస్ లీక్ కావడం వల్లనే గ్యాస్ సిలిండర్ అంటుకున్నట్లు భావిస్తున్నారు.