'రోహిత్ దళితుడు కాదు, హెచ్సియు వీసి భయంతో దాక్కున్నారు'
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోదని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి శనివారం స్పష్టం చేశారు. హెచ్సియు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాజా ఘటనలపై కాంగ్రెస్, మజ్లిస్ సభ్యులు సభలో శనివారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో మంత్రి నాయని ఈ ఘటనలపై ప్రకటన చేశారు. ఈ నెల 22న విధుల్లో చేరిన హెచ్సియు వీసీ అప్పారావు సమావేశం నిర్వహిస్తుండగా దాదాపు వందమంది విద్యార్థులు వెళ్లారని, గేట్లు దూకి వస్తువులను ధ్వంసం చేశారని చెప్పారు.
వీసీ ప్రాణభయంతో ఓ గదిలో దాక్కున్నారని, పోలీసులు అక్కడికి చేరుకొని ఆరు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, వినకపోవడంతో అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసులపై రాళ్ల దాడి చేశారన్నారు. పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు.
25 మంది విద్యార్థులు, ఇద్దరు బోధనా సిబ్బందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని, కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు. వీసీ అనుమతి లేనిదే పోలీసులు అక్కడికి వెళ్లరన్నారు.
నాయిని
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ రోహిత్ కులంపై గంటల్లో విచారణ జరిపారని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. నాయిని కలగజేసుకొని రోహిత్ దళితుడు కాదని, వడ్డెర కులం అని తేలిందని అందువల్ల ఈ విషయంలో దళితుల సమస్య లేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ
ఈ నెల 21న ఓయూలోని నీటి సంపులో మృతదేహం లభ్యమవడం... మృతదేహం తరలింపును విద్యార్థులు అడ్డుకోవడంపై నాయిని ప్రకటన చేశారు. సంపులో దొరికిన మాణికేశ్వర్ నగర్కు చెందిన సిలారుబాబు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఓయూ విద్యార్థులు అడ్డుపడి మృతుడి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారని, పోలీసులు మృతుడి ఆధార్, రేషన్ కార్డు తెప్పించి చూపించారని, అది ఓయూ విద్యార్థి మృతదేహమని వాదించారని తెలిపారు.
సంపత్ కుమార్
మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా అడ్డుపడ్డారని,. ఎమ్మెల్యే సంపత్ కుమార్ వచ్చి వివరాలు తెలుసుకున్నా సంతృప్తి చెందకుండా ధర్నాకు దిగారని, విద్యార్థులు రెచ్చిపోయి పోలీసుల పైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారని చెప్పారు. పోలీసులు గాయపడ్డారన్నారు.
హరీష్ రావు
ఎమ్మెల్యే సంపత్, ఆచార్య గాలి వినోద్ కుమార్ల వాహనాలూ దెబ్బతిన్నాయని, ఈ సంఘటనలపై అయిదు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాపు చేస్తున్నారన్నారు. ఓ సమయంలో హరీష్ రావు కల్పించుకొని.. ప్రతిపక్షాలు చర్చించాలనుకుంటున్నారా.. రచ్చ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
సుప్రీం కోర్టు తీర్పు మేరకు యాకూబ్ మెమెన్కు ఉరి వేస్తే ఆయనకు మద్దతుగా.... దేశ సార్వభత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా సహించాలని బిజెపి ప్రశ్నించింది.
లక్ష్మణ్
హెచ్సియులో విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈ ఘటనలు, చనేత కార్మికుల సమస్యలపై వాయిదా తీర్మానాలపై చర్చించాలన్నారు.
రేవంత్ రెడ్డి
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ ఢిల్లీ నుంచి పరుగెత్తుకు వచ్చారని, మరి తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హెచ్సియు ఘటనలో కేంద్రమంత్రి బాధ్యత ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
స్పీకర్ చైర్లో గీతా రెడ్డి
శాసన సభలో శనివారం నాడు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమమెల్యే గీతారెడ్డి కాసేపు ప్యానల్ స్పీకర్గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి భోజనానికి వెళ్లిన సమయంలో గీతా రెడ్డి తాత్కాలిక స్పీకర్గా వ్యవహరించారు. స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థతకు గురయ్యారు.