ఆ దోషుల్ని వదలం, వీడియోలున్నాయ్: మజ్లిస్ దాడిపై నాయిని, 7 సర్వేలు మావైపే: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నివాసంపై దాడికి పాల్పడిన దుండగులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి స్పష్టం చేశారు. మహమూద్ అలీ ఇంటి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి నివాసంపైన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. పాతబస్తీలో జరిగిన ఘటనకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. దాడికి కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
కాగా, జిహెచ్ఎంసి ఎన్నికల సందర్బంగా ఇవాళ పాతబస్తీలోని అజంపురలో ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ నివాసంపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. మహమూద్ ఆలీ కుమారుడు అజం ఆలీపై ఎమ్మెల్యే బలాల, కార్యకర్తలు దాడి చేశారు. విషయం తెలిసిన టీఆర్ఎస్ శ్రేణులు వెంటనే స్పందించాయి. గుంపులుగుంపులుగా టీఆర్ఎస్ కార్యకర్తలు మహమూద్ ఆలీ నివాసానికి చేరుకుని మద్దతుగా నిలిచారు.
మేమే గెలుస్తామని సర్వేలూ చెబుతున్నాయి: కెటిఆర్
ఏడు సంస్థల ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు టిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని చెప్పాయన్నారు. ఎన్నికల చివరి నిమిషం వరకు ప్రశాంతంగా సాగాయన్నారు. అయితే పాతబస్తీలో మజ్లిస్ - కాంగ్రెస్, మజ్లిస్ - తెరాస నేతల మధ్య జరిగిన ఘర్షణ దురదృష్టకరమన్నారు.
ఈ ఘటనలకు బాధ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ఈ చెదురుముదురు సంఘటనలు పోలింగ్ కేంద్రాల బయటే జరిగాయని చెప్పారు.
అయితే, హైదరాబాదీలు మరింత పెద్ద ఎత్తున వచ్చి ఓటింగులో పాల్గొంటే బాగుండేదన్నారు. అప్పుడు తమ పార్టీ మెజార్టీ మరింత పెరిగేదన్నారు. 2009లో 42 శాతంకు పైగా పోలింగ్ నమోదయిందని, ఇప్పుడు దాదాపు యాభై శాతం నమోదవుతుందని భావిస్తున్నామన్నారు. గ్రేటర్ పైన తెరాస జెండా ఎగురవేస్తుందన్నారు.
2009 కంటే పోలింగ్ శాతం పెరిగినా, మరింత పెరగాల్సి ఉంటే బాగుండునన్నారు. నిన్న మొన్న జరిగిన ఘటన పైన అధికార పార్టీ నేతల పైన కూడా కేసులు పెట్టారని, దానిని బట్టే పారదర్శకత అర్థమవుతోందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుకు కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.
భవిష్యత్తులో ఓటింగ్ శాతం పెరిగేలా చేస్తామని కెటిఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉపయోగించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పాతబస్తీలోని దాడుల పైన పోలీసులు చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటారన్నారు.