నయీంతో లింక్స్: వివరణకు వేదిక మార్చుకున్న మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పోలీసు శాఖలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నయీంకు మాజీ డీజీపీ దినేశ్ రెడ్డితో సంబంధాలున్నాయంటూ నయీం డైరీలో ఈ మేరకు రాసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నయీం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు దినేశ్ రెడ్డి పీసీ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని, బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రావాలని మీడియాకు సమాచారం పంపారు.
అయితే దీనిపై స్పందించిన బీజేపీ, ప్రెస్ మీట్ అవసరం లేదని దినేశ్ రెడ్డికి సలహా ఇచ్చింది. అంతేకాదు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు దినేశ్ రెడ్డికి అనుమతి కూడా నిరాకరించింది. దీంతో ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సిన ప్రెస్ మీట్ను ఆయన వాయిదా వేసుకున్నారు.
అంతేకాదు నయీం కేసులో నేరుగా తన పేరు రాకుండానే స్పందించడం ఎందుకంటూ దినేశ్ రెడ్డిని బీజేపీ ప్రశ్నించినట్లు సమాచారం. మీడియాకు సమాచారం పంపినందువల్లే తాను మాట్లాడుతున్నానని దినేశ్ రెడ్డి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. నయీం కేసులో దినేశ్ రెడ్డి పేరు ఎక్కడా ప్రత్యక్షంగా రాలేదని, ప్రెస్ మీట్ పెట్టి స్పందించాల్సిన అవసరం లేదని బీజేపీ సలహా ఇచ్చింది.
దీంతో ఆఖరి నిమిషంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీడియా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు దినేశ్ రెడ్డి మీడియాకు సమాచారం తెలిపారు. అయితే పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు బీజేపీ అనుమతి నిరాకరించడంతో బయట ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాలనే దినేశ్ రెడ్డి ఉన్నారు.
ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నాం 1 గంటకు ఓ హోటల్లో మీడియా సమావేశం పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రెస్మీట్లో అసలు దినేశ్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు, అసలు నయీం కేసులో తన పేరు ఎందుకు వచ్చిందనే దానిపై ఆయన వివరణ ఇవ్వనున్నారు.
పార్టీ కార్యాలయంలో తన ప్రెస్ మీట్కు బీజేపీ ఎందుకు అనుమతివ్వలేదనే విషయంపై కూడా ఆయన స్పందిస్తారని తెలుస్తోంది. మరోవైపు గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సిట్ బృందం దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈ మేరకు రాజేంద్ర నగర్ ఏసీపీ ఆఫీసులో సిట్ బృందం శనివారం సమావేశమైంది. నయీం కేసు దర్యాప్తులో మాజీ డీజీపీకి సంబంధాలున్నాయని తెలియడంతో సిట్ బృందం దీనిపై కూడా దృష్టిపెట్టింది.