నయీం కేసులో షాక్: టీవీ ఛానల్ సీఈవో అరెస్ట్, చత్తీస్గఢ్లో కొత్త యాంగిల్
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు, ఇంకా ప్రారంభంకాని ఐటెన్ టీవీ ఛానల్ సీఈవో హరిప్రసాద్ రెడ్డిని గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం సిట్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించారని నల్గొండ పోలీసులు చెప్పారు.
విచారణలో.. నయీంతో కలిసి హరిప్రసాద్ రెడ్డి పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లుగా తెలిసిందని చెప్పారు. ఛానల్ ఏర్పాటుకు నయీంతో చేతులు కలిపాడనీ, హైదరాబాదులోని ఐటెన్ ఛానల్ కార్యాలయంలో రూ.13.50 లక్షలు విలువ చేసే కంప్యూటర్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
గత ఏడాది గణేష్ ఉత్సవ సమయాల్లో ప్రకాశం బజార్లో నయీం అనుచరులు ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రచారం కల్పించేందుకు 80 మంది విలేకరులు, కెమెరామెన్లకు రూ.80 వేల నగదు, టైటాన్ చేతి గడియారాలు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు.
చత్తీస్గఢ్లో నయీం కొత్త కోణం
గ్యాంగ్ స్టర్ నయీం వివిధ రూపాల్లో తిరిగేవాడనే విషయం తెలిసిందే. ఎవరూ తనను గుర్తు పట్టకుండా రాత్రుల్లు రావడం, ఆడవేషాల్లో తిరగడం వంటివి చేసేవాడు. అతనికి చత్తీస్గడ్లోను నెట్ వర్క్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ అతను నయీంగా కాకుండా జేమ్స్ అనే పేరుతో సంచరించేవాడని తెలుస్తోంది.
సిట్ విచారణలో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఇన్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న అనంతరం చత్తీస్గఢ్లో మావోలను అణచివేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులకు తనవంతు సహాయ సహకారాలను అందించాడు.
తనను గుర్తించకుండా ఉండేందుకు నయీం... జేమ్స్ పేరిట తిరిగినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులకు చిక్కకుండా ఉండేందుకు కూడా మారుపేరు సహకరించిందని సిట్ అధికారి ఒకరు తెలిపారని తెలుస్తోంది. నయీం ముఖ్య అనుచరుల్లో ఒకడైన పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించిన అధికారులు భువనగిరి సమీపంలోని రాయగిరి, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో పలువురిని విచారించారు. కొందరిని అరెస్ట్ చేశారు.