కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు: నయీం బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పోలీసులు ఎన్ కౌంటర్లో నయీం హతమవ్వడంతో నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో ఆయన బాధితులు ఒక్కొక్కరుగా బయటికొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు.
తాజాగా గురువారం నయీం ముఠా భువనగిరికి చెందిన నందిని ఎలక్ట్రికల్స్ యజమానిని రూ. 2కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించిన వైనం వెలుగు చూసింది. నందిని ఎలక్ట్రానిక్స్ యాజమని చెంచు నరహరి అప్పట్లో నయీం తనను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నయీం తనను రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు మీడియాలో కన్నీరు పెట్టుకున్నాడు. తాను భువనగిరి మెయిన్ రోడ్డు ప్రక్కన భవనం నిర్మిస్తున్న విషయం తెలుసుకుని నయీం అనుచరులు డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నాడు. నయీం అనుచరులు తన వద్దకు వచ్చి తన కళ్లకు గంతలు కట్టి నయీం వద్దకు తీసుకెళ్లినట్టు బాధితుడు వాపోయాడు.
ఆసక్తికరం: నయీం ఎకె47లు సోహ్రబుద్దీన్ నుంచి సేకరించినవే?
రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేయడంతో తాను అంత సొమ్ము ఇచ్చులేనంటూ నయీంను ప్రాధేయపడినట్టు తెలిపాడు. తన ఆస్తంతా అమ్మినా కూడా రెండు కోట్లు రాదని చెప్పినా నయీం మొదట వినలేదని, చివరికి రూ.25 లక్షలు ఇవ్వాలని రెడ్ ఇంక్తో రాసినట్టు బాధితుడు నరహరి మీడియాకు వివరించాడు.
గడువులోపు చెల్లించకపోతే తన భార్య బిడ్డలను చంపుతానని బెదిరించాడని కన్నీరు పెట్టుకున్నారు. తాను అప్పు చేసి నయీంకి రూ.25 లక్షలు చెల్లించినట్లు నరహరి తెలిపాడు. నయీం ఆగడాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డానని తనకు ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.