నయీం సోదరి ఇంట్లో సోదాలు: వంట మనిషి ఏం చెప్పిందంటే...
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం విషయంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీం ఆస్తులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, నయీం కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని డిజిపి అనురాగ్ శర్మ రేపు బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి.
కాగా, బంధువులు, అనుచరుల ఇళ్లలో సాగుతున్న సోదాల్లో భాగంగా మెదక్ జిల్లాలోని కోహిల్ గఢి కాలనీలో నివాసం ఉంటున్న నయీం సోదరి అయేషా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కోహిర్, హైదరాబాద్, నల్గొండలో ఉన్న స్థలాలకు సంబంధించిన నాలుగు పత్రాలు, 5 ఎకరాల పొలం దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.
వంట మనిషి ఏం చెప్పిందంటే..
అదలావుంటే, గ్యాంగ్స్టర్ నయీం ఇద్దరుఅనుచరులు ఫర్హానా, అఫ్షలకు న్యాయస్థానం ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. విచారణ నిమిత్తం వారిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. వారి విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం నయీం ఇద్దరు అనుచరులను 10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
నయీం చేసిన నేరాలను చాలా దగ్గరి నుంచి వంట మనిషిగా పనిచేసిన ఫర్హానా (30) చూసింది. నయీం కిడ్నాపులు, బెదిరింపులు, డబ్బు లాగడం వంటివి చేసేవాడని ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంట్లో బంగారం, వజ్రాలు, నగదు ఉండేవని ఆమె తెలిపింది. పెద్ద యెత్తున భూములకు సంబంధించిన పత్రాలను తెచ్చేవాడని కూడా ఆమె చెప్పింది.
నయీం తరచుగా కొందరికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చేవాడని కూడా చెప్పింది. ఫర్హాన చెప్పిన విషయాలను పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో నయీమ్ హతమైన తర్వాత అలకాపురి టౌన్షిప్ వద్ద పోలీసులు ఫర్ఙానాతో పాటు కారు డ్రైవర్ భార్య అఫ్షాను అరెస్టు చేశారు. తుపాకులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భర్త మరణించిన తర్వాత...
తన భర్త మరణించిన తర్వాత నయీం దగ్గర తాను వంటమనిషిగా చేరినట్లు ఫర్ఙానా చెప్పింది. నల్లగొండ జిల్లా మిర్యాలగుడాకు చెందిన తనను నయీం బంధువు హైదరాబాదుకు తీసుకొచ్చాడని, తనతో పాటు అఫ్షా కూడా నయీం ఇంట్లో పనిచేసేదని చెప్పింది.
తాము నయీం కుటుంబ సభ్యులను, పిల్లలను చూసుకునేవాళ్లమని, అతని పిల్లలను అలకాపురి టౌన్షిప్కు తీసుకుని వచ్చేవాడని, నయీంకు తమపై నమ్మకం ఉండేదని ఆమె చెప్పింది.
సోమవారం అఫ్షాతో పాటు టీవీ చూస్తుండగా కాల్పుల శబ్దం వినిపించిందని, నయీం మరణించాడని గుర్తించామని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నామని, కొంత నగదుతో బయటపడాలని తాము అనుకున్నామని, అయితే తమను వెంటనే పోలీసులు అరెస్టు చేశారని ఆమె చెప్పింది.