నయీం ఫాలోవర్ శ్రీహరి అరెస్ట్, తనకెలాంటి సంబంధం లేదని కామెంట్
హైదరాబాద్ : నయీంతో సంబంధాలు కొనసాగించిన అతని కీలక అనుచరుడు శ్రీహరి బుధవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట లొంగిపోయాడు. గుజరాత్ లో జరిగిన సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో శ్రీహరి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
నయీం ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీహరి.. అనూహ్యంగా బుధవారం నాడు లొంగిపోవడంతో.. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నయీంతో సంబంధాలున్న 50మంది అతని అనుచరులను ఇప్పటిదాకా సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. వీరందరి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్న సిట్.. నయీంతో సంబంధాలున్న మరికొంతమంది కోసం తీవ్రంగా గాలిస్తోంది.
తాజా శ్రీహరి లొంగబాటుతో నయీంకు సంబంధించి మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.
నయీంతో నాకెలాంటి సంబంధం లేదు : శ్రీహరి
రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట లొంగిపోయిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీహరి.. నయీంతో తనకెలాంటి సంబంధాలు లేవని పేర్కొనడం గమనార్హం. రియల్ ఎస్టేట్ ద్వారే నయీంతో పరిచయం ఏర్పడిందన్న శ్రీహరి.. కేవలం న్యాయపరమైన సలహాల కోసమే నయీం తనను సంప్రదించేవాడని తెలిపాడు.
నయీంతో సంబంధాలున్నట్లు తనపై వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నాడు శ్రీహరి. నయీంకు తనకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవన్నాడు. పైగా.. 2013లో నయీమే తనపై దాడి చేయించినట్లుగా వెల్లడించాడు. 2006లో ఆదిభట్లలో నాలుగెకరాల భూమి కొనుక్కున్నానని, పక్క పొలానికి చెందిన వ్యక్తులు తన భూమిని కబ్జా చేసుకోవడంతో.. అప్పట్లో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చాడు.