‘భువనగిరి భాయ్’ అంటే భయం లేదా? ఖతం చేస్తాం: తెరపైకి నయీం గ్యాంగ్
హైదరాబాద్: పోలీసుల ఎదరుకాల్పుల్లో హతమైన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ నయీం అనుచరులు అతని అరాచకాలను కొనసాగిస్తున్నారు. నయీం హతమైన ఏడాది తర్వావాత అతని అనుచరులు తెరపైకి వచ్చారు. నయీం పేరుతో మళ్లీ దందా ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన వీరేశం అనే వ్యాపార వేత్తను నయీం అనుచరులు బెదిరించడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.
'భువనగిరి భాయ్' పేరు చెబితే ఎవరైనా భయపడాల్సిందేనని వారు ఫోన్ ద్వారా బెదిరించారు. రాజేంద్రనగర్లోని టీఎన్జీవో కాలనీలో భూమిని తమపేరిట బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్.. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి అని, ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులను మార్చగలడని.. అతని భార్య వస్తుందని, ఆమెతో కలిసి ఆ భూమి బదిలీ చేయించాలని తేల్చి చెప్పారు.
'విద్యాసాగర్ పేరు చెప్పినా పట్టించుకోవా?' అంటూ బెదిరింపులకు దిగారు. లేదంటే ఆమెకు 50లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎక్కడున్నా ఐదు నిమిషాల్లో లేపేస్తానని హెచ్చరించారు. దీంతో బాధితుడు బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
అయితే గతంలో భువనగిరి భాయ్ పేరుతో నయీం దందాలు చేసేవాడప్పుడు అతని పేరుతోనే దుండగులు సెటిల్మెంట్ లు చేస్తుండడంతో అతని అనుచరులు ఈ దందాకు తెరలేపారా? లేక నయాం పేరు చెప్పుకుని ఎవరైనా ఆ దురాగతాన్ని మొదలుపెట్టారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.