తల్లే చంపమంది, ఆ మృతదేహాం బావదే: నయీం కిరాతకం వెనుక ఇదీ జరిగింది..
నయీం కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల మేరకు ఆ మృతదేహాన్ని అతని బావ నదీమ్ గా గుర్తించారు.
హైదరాబాద్ : రాజధాని పరిసర ప్రాంతాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించి పలు అక్రమాలకు పాల్పడ్డ గ్యాంగ్ స్టర్ నయీం ఎంతటి కిరాతకుడో ఇప్పటికే పలు ఉదంతాలు వెల్లడించాయి. ఆఖరికి సొంత బావ కొండా విజయ్కుమార్ అలియాస్ నదీమ్తో సైతం నయీం హత్య చేశాడన్న వార్త అప్పట్లో సంచలనం రేపింది.
'భువనగిరి భాయ్' అంటే భయం లేదా? ఖతం చేస్తాం: తెరపైకి నయీం గ్యాంగ్
ఇటీవలే శంషాబాద్ పోలీసులు ఈ హత్యపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. తల్లి తాహెరాబేగం ఆదేశాలతోనే నయీం నదీమ్ ను అంతమొందించినట్లుగా అందులో పేర్కొనడం గమనార్హం.
ఇలా వెలుగులోకి:
2013 ఫిబ్రవరి 2న శంషాబాద్ మండలం పెద్దతూప్ర గ్రామ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం కనిపించింది. మృతదేహాం సగానికి పైగా కాలిపోయి ఉండటంతో ఆ వ్యక్తి ఎవరనేది అప్పట్లో నిర్దారించలేకపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ మృతదేహాం మిస్టరీ వీడలేదు. అయితే నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తుండటంతో.. నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి.
వాళ్లేం చెప్పారు:
నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని మేనకోడలు సాజిదా షహీన్ అలియాస్ సజ్జు అలియాస్ తానియా, ఆమె భర్త మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ అలియాస్ తైమూర్ అలియాస్ సలీమ్ రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. వారు వెల్లడించిన వివరాల మేరకు నయీమే పథకం ప్రకారం పెద్ద తూప్ర శివారులో నదీమ్ ను హత్య చేశాడు. నయీం గ్యాంగ్ ను వీడి బయటకు వెళ్లాలని నదీమ్ నిర్ణయించుకోవడమే అతని ప్రాణాల మీదకు తెచ్చిందని తెలిపారు.
నేరాలు బయటపెడుతాయనే:
నిజానికి కొండా విజయ్ కుమార్ మతం మార్చుకుని మరీ నయీమ్ అక్క సలీంను వివాహం చేసుకున్నాడు. నయీమ్తో కలిసి పలు నేరాల్లో పాలుపంచుకున్నాడు. అయితే అకస్మాత్తుగా అతను గ్యాంగ్ ను వీడి వెళ్లిపోతాననేసరికి నయీమ్ ఆగ్రహావేశాలకు లోనయ్యాడు.
తన గ్యాంగ్ చేసిన నేరాలన్ని నదీమ్ కు తెలుసు కాబట్టి.. అతను బయటకు వెళ్తే అవన్నీ బయటపడుతాయని భావించాడు. అందుకే అతన్ని హత్య చేయడానికే నిర్ణయించుకుని ఒక పథకం వేశాడు.
ఇంట్లోనే మర్డర్:
2013లో నయీం శంషాబాద్ సాతంరాయిలో అజ్ఞాత జీవితాన్ని కొనసాగించాడు. కుటుంబసభ్యులతో కలిసి అక్కడి పప్పూ హౌస్లో ఉండేవాడు. ఇదే క్రమంలో నదీమ్ తో విబేధాల నేపథ్యంలో అతన్ని హత్య చేయాలనుకున్నాడు. 2013 ఫిబ్రవరి 1న సాయంత్రం 'నీతో కొంచెం మాట్లాడే పని ఉంది' అంటూ బావ నదీమ్ను నయీమ్ పప్పూ హౌస్కు పిలిపించాడు.
గ్యాంగ్ ను వీడే విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో నయీంతోపాటు అతడి భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరాబేగం, మేనకోడలు సాజిదా, ఆమె భర్త ఫహీమ్, నయాం సంరక్షురాలు ఫర్హానా అక్కడే ఉన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో నదీమ్పై నయీం, ఫహీమ్, సలీమా, హసీనా, సాజిదా కలిసి దాడి చేశారు.
వారు అలా దాడి చేస్తుండగానే.. అతన్ని చంపేయాల్సిందిగా నయీం తల్లి తాహేరా ఆదేశించింది. దీంతో భార్య చున్నీని నదీమ్ మెడకు బిగించి నయీం హత్య చేశాడు. హత్యానంతరం ఫహీమ్, నస్రీన్, సదా, కరీనా, ఫర్హానాలు కలిసి మృతదేహాన్నిఅదే రాత్రి తమ కారులో పెద్దతూప్ర శివారుకు తీసుకెళ్లారు. అక్కడే మృతదేహాన్ని కాల్చి వెనుదిరిగారు.