ఎన్కౌంటర్: గ్యాంగ్స్టర్ నయీం గురువు మృతి, 26 ఏళ్లు ఇంటి ముఖం చూడలేదు
హైదరాబాద్: మిలిటెంట్గా ఉద్యమాన్ని ప్రారంభించి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన చామల కిష్టయ్య అలియాస్ దయ 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్తో సోమవారం ఉదయం ముగిసింది. నల్గొండ జిల్లాలో ఎందరినో అతను ఉద్యమ బాట పట్టించాడు.
అతను అంచెలంచెలుగా ఎదికి కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక మధిర గ్రామమైన దాసిరెడ్డిగూడేనికి చెందిన చామల చంద్రమ్మ, రామయ్యల ఆరో సంతానం కృష్ణయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరాడు.
భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో బీకాం చదువుతూ 1990లో ఆర్ఎస్యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్గా పని చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఎందరినో ఉద్యమంలోకి తీసుకెళ్లాడు. వలిగొండ, భువనగిరి, ఆలేరుతో పాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు.
హైదరాబాదులో పీపుల్స్ వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ పూర్తిస్థాయి ఉద్యమంలోకి వెళ్లాడు. పీపుల్స్ వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్ స్టర్గా మారిన నయీంతో పాటు మరెందరినో పార్టీలో చేర్పించాడు. ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో చదువుతుండగా అదే కాలేజీలో చదువుతున్న నయీంను పీపుల్స్ వార్లో చేర్పించాడు.
అలాగే అతడి స్వగ్రామం దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కోనాపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. వలిగొండలో పీపుల్స్వార్కు ఎందరో కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడు కృష్ణయ్య అని చెబుతారు.
కృష్ణయ్య 26 ఏళ్లుగా ఒక్క రోజు కూడా ఇంటి ముఖం చూడలేదు. నిరుపేదలైన అతడి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నా వారిని పట్టించుకోలేదని అంటుంటారు. కనీసం ఫోన్ చేయలేదంటారు. గ్రామస్తులకు కూడా కిష్టయ్య పేరు తప్ప ఆయన ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. 2008లో కిష్టయ్య ఓసారి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు.