నయీం మరో ఘాతుకం: టీవీ జర్నలిస్టును నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశాడు
హైదరాబాద్: తనకు ఇన్ఫార్మర్గా మారడానికి నిరాకరించి, తాను ఇచ్చిన గిఫ్టులను తీసుకోవడానికి నిరాకరించిన టీవీ జర్నలిస్టును నయీం అత్యంత కిరాతకంగా చంపించాడు. బాబర్ ఖాన్ అనే టీవీ జర్నలిస్టు అతని చేతిలో హతమయ్యాడు. నయీం కుడి భుజం పాశం శ్రీను సిట్ దర్యాప్తులో ఈ వివరాలు వెల్లడించాడు.
టీవీ జర్నలిస్టు బాబర్ ఖాన్ కొనపురి సోదరులకు దగ్గరగా ఉండేవాడు. దాంతో తమకు ఇన్ఫార్మర్గా మారాలని, రాములు వివరాలు తమకు చెప్పాలని నయీం అనుచరులు అతన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ జర్నలిస్టు లొంగలేదు. తనకు అనుచరుడుగా వస్తే లక్షలు కుమ్మరిస్తానంటూ ఎరవేశాడు. ఫలితం లేకపోవటంతో అడ్డు తొలగించుకునేందుకు పథక రచన చేశాడు.
అందుకు పాశం శ్రీనును రంగంలోకి దింపాడు. శీను బాబర్ఖాన్ ఇంటికి వెళ్లి అతన్ని బైక్పై భువనగిరికి తీసుకెళ్లాడు. మమతా కాలనీలోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. కాళ్లు, చేతులు కట్టేశారు. నోట్లో బట్టలు కుక్కి తీవ్రంగా కొట్టారు. రాములు కదలికలు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. బాబర్ఖాన్ గోళ్లు పీకారు. జుట్టు పట్టుకుని రక్తం వచ్చేలా లాగారు. నుదిటి నుంచి కాలిగోటి వరకూ సీసా పెంకులతో ప్రత్యక్ష నరకం చూపారు.
వారం రోజులపాటు తమ కసితీరా కొట్టి చివరకు చంపేశారు. మరణించాడని ధ్రువీకరించుకున్న తర్వాత శవాన్ని పాశం శ్రీను అతడి అనుచరులు ఓ అర్ధరాత్రి వేళ భువనగిరి రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లోకి చేర్చారు. పాత టైర్లు వేసి మసి చేశారు. కాలి బూడిదయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు.
అస్తికలు, బూడిదను దగ్గరలోని ఓ వాగులో పడేశారు. బాబర్ఖాన్ కనిపించకుండాపోయిన మరుసటి రోజే అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎప్పటిలాగే పాశం శ్రీను పోలీసులకు లొంగిపోయి తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు.