సహకరిస్తున్నాం, మంచి రాజధాని: :చంద్రబాబుకు నాయిని ప్రశంసలు
విజయవాడ: విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన విజయవాడలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
విజయవాడ నుంచే పరిపాలించాలనే ఆలోచన మంచిది అన్నారు. ఏపీ నుంచి పాలించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవంతో పాటు, అమరావతి నుంచే పాలన సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని పై వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ను పాలించిన వారు హైదరాబాద్పై తప్ప ఇతర ప్రాంతాలపై దృష్టి సారించలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ దశ మారిందన్నారు. ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి రాజధానిని నిర్మిస్తున్నారని కొనియాడారు.
పరిపాలనను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చడం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల వంటి సమస్యలపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఉండే ఆంధ్రా ప్రాంతం వారికి తమ ప్రభుత్వం అన్నివిధాలా సహకారిస్తోందన్నారు.
ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపించాలని కమలనాథన్ కమిటీని కోరామన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారు అంతా ఒక్కటే అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.