నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూత...
దివంగత నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో నాయినితో పాటే ఆమె అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ... ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురయ్యారు. అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం(అక్టోబర్ 26) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నాయిని కన్నుమూసిన నాలుగు రోజులకే ఆయన సతీమణి కూడా కన్నుమూయడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
నాయిని చనిపోయిన రోజు ఆస్పత్రిలోనే ఉన్న అహల్య... వీల్ చైర్లోనే భర్తను కడసారి చూసేందుకు వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఆమెను ప్రత్యేక అంబులెన్సులో మినిస్టర్ క్వార్టర్స్కి తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె... నాయిని ఇక లేరన్న విషయాన్ని తట్టుకోలేకపోయారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కొడుకులు,కుమార్తెలు ఆమెను ఓదార్చారు.
Recommended Video
కాగా,గత గురువారం అర్ధరాత్రి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ శ్వాస సమస్యలు తలెత్తడం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన కన్నుమూశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.