భద్రాచలంలో విద్యార్థి గల్లంతు: పెరిగిన భక్తుల రద్దీ, పరిశీలించిన నాయిని
భద్రాచలం: గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలానికి భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కర స్నానం చేశాక భద్రాద్రి రాముడ్ని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి.
ఈ క్రమంలో స్వామి వారి దర్శనానికి ఏకంగా 6గంటల సమయం పడుతోంది. దీంతో రద్దీకి అనుగుణంగా భక్తులు దర్శనానికి సిద్ధమవ్వాలని ఐజి నవీన్ చంద్ సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ కాళేశ్వరం, భద్రచాలం బయలుదేరి వెళ్లారు.
మొదట కాళేశ్వరంలోని ఘాట్లను పరిశీలించిన హోంమంత్రి నాయిని.. అనంతరం భద్రాచలం వెళ్లారు. అక్కడ పుష్కర ఘాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
భద్రాద్రిలో విద్యార్థి గల్లంతు
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. పవన్ అనే విద్యార్థి పుష్కరస్నానం చేసేందుకు నదిలోకి దిగి బురదలో కూరుకుపోయి గల్లంతయ్యాడు. పవన్ స్వస్థలం కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామం. విద్యార్థి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.