కిమ్స్-హైదరాబాద్ వైద్యుల ఘనత, శిశువుకు నియోటనల్ ఈసీఎంవో
హైదరాబాద్: కిమ్స్ - హైదరాబాద్ ఆసుపత్రి మరో ఘనత సాధించింది. తొలిసారి నియోనటల్ (కొత్తగా పుట్టిన శిశువు)కు ఈసీఎంవో (ఎక్స్ట్రాకార్పోరేల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) విజయవంతంగా నిర్వహించింది. ప్రముఖ ప్రయివేటు ఆసుపత్రులలో కిమ్స్ ఒకటి.
ఏపీ, తెలంగాణలో పుట్టిన శిశువుకు నియోనటల్ ఈసీఎంవో చేయడం ఇది తొలిసారి. డాక్టర్ నంద కిషోర్ నేతృత్వంలోని బృందం రెండు నెలల శిశువుకు దీనిని నిర్వహించింది. గుండె, ఊపిరితిత్తులు సరిగా పని చేయని వారికి ఈసీఎంవో చేస్తారు.
రెండు నెలల క్రితం ఓ ప్రయివేటు నర్సింగ్ హోంలో పుట్టిన పాపకు మెకోనియమ్ ఆస్పిరేషన్ సిండ్రోమ్ (ఎంఏఎస్) ఉందని నిర్ధారణ అయింది. దీనికి సరైన చికిత్స అందించకుంటే చిన్నారులు చనిపోయే అవకాశం కూడా ఉంది.
ఆ పుట్టిన పాపను తొలుత ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ పైన ఉంచారు. కానీ ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆ పాపను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ వైద్యులు ఈసీఎంవో నిర్వహించి, సఫలమయ్యారు.