ఉత్తమ్ ఇలాఖాలో గులాబీ గుబాళింపు: నేరేడుచర్ల మున్సిపాలిటీని చేజిక్కించుకొన్న కారు
నేరేడుచర్ల మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడింది. మున్సిపల్ చైర్మన్పై నిన్నటి నుంచి నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా కేవీపీ రామచంద్రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాల్సిన మున్సిపాలిటీని టీఆర్ఎస్ చేజిక్కించుకొంది.
ఇదీ లెక్క..
నేరేడుచర్లలో 15 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో ఏడు వార్డులు గెలిచాయి. సీపీఏ ఒక చోట విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ 8 సీట్లతో చైర్మన్ పదవీ చేపట్టడం ఖాయమనే సమయంలో తెరపైకి ఎక్స్ అఫిషీయో ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు కూడా వచ్చారు. కానీ టీఆర్ఎస్ నుంచి నాలుగు ఓట్లు రావడంతో.. కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరమైపోయింది. నేరేడుచర్ల మున్సిపాలిటీ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికే హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుపై గులాబీ జెండా ఎగరేసిన టీఆర్ఎస్ పార్టీ.. మున్సిపాలిటీని కూడా దక్కించుకోవాలని వ్యుహాత్మకంగా వ్యవహరించింది.
తెరపైకి శేరి పేరు
టీఆర్ఎస్ ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషీయో సభ్యులు నలుగురు చేరారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కూడా ఇక్కడే ఓటు నమోదు చేయించుకున్నారు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా ఇక్కడ తన పేరు రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ముగ్గురితో చెరో 10-10 సభ్యులతో సమానంగా ఉంటారు. కానీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా ఇక్కడే తన ఓటును నమోదు చేయించుకున్నారు. తాను కూడా ఓటు వేస్తానని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం, వెంటనే అనుమతివ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ కన్నా ఒక్క ఓటును టీఆర్ఎస్ పార్టీ సంపాదించగలిగింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ముందే బోర్డులో బలాబలాలను ఉంచడంతో నేరేడుచర్ల టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిందని అర్థమైంది.
25వ తేదీకి ముందే..
25వ తేదీ లోపు ఎక్స్ అఫిసీయో సభ్యుడిగా నమోదు చేసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కానీ అలా జరగలేదని.. ఈసీ నాగిరెడ్డి కూడా అధికార పార్టీకి వత్తాసు పలికాడని విమర్శించారు. టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ ఉత్తమ్, కేవీపీ నేరేడుచర్ల సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. సమావేశాన్ని వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. రోడ్డుపై బైఠాయించిన ఉత్తమ్, కేవీపీ సహా కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదని ఉత్తమ్ ఆరోపించారు.
144 సెక్షన్
కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్తో నేరేడుచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు 144 సెక్షన్ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు నేరేడుచర్ల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సాగింది. 11 మంది ఓట్లతో టీఆర్ఎస్ మున్సిపాలిటీ చేజిక్కించుకొంది. చైర్మన్గా జయబాబు, వైస్ చైర్మన్గా శ్రీలతారెడ్డిని ఎన్నుకొన్నారు.