ఎస్పీ, ఎస్ఐ ఏం చెప్తారో?: నేరెళ్ల కేసులో అదే కీలకం.. కౌంటర్కు 10రోజుల గడువు
నేరెళ్ల దళితులపై దాడి ఘటనలో క్రిమినల్ కేసుల నమోదు విషయంలో జరిగిన జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: నేరెళ్ల దళితులపై దాడి ఘటనలో క్రిమినల్ కేసుల నమోదు విషయంలో జరిగిన జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధితుల తరుపున రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ రాసిన లేఖను 'పిల్'గా స్వీకరిస్తూ దానికి కౌంటర్ దాఖలు చేయమని కోరింది.
ఎందుకింత జాప్యం.. క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదు?: 'నేరెళ్ల 'పై హైకోర్టు సీరియస్
ఇదే విషయంపై పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మంగళవారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎస్పీ, సస్పెన్షన్కు గురైన ఎస్సైలు తమ వాదనలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని వారి న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో న్యాయస్థానం వారికి 10రోజుల గడువు మంజూరు చేసింది.
నేరెళ్ల ఇసుక కథ: కెసిఆర్ ఎదురు ప్రశ్నే తప్ప....
గడ్డం లక్ష్మణ్ పిటిషన్:
నేరెళ్ల మరో 2 గ్రామాల్లోని దళితుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని, విచక్షణారహితంగా కొట్టారని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది.
నేరెళ్ల ఘటన: కెసిఆర్ అలా, సెగ తాకితే గానీ కెటిఆర్ దిగిరాలేదా....
డీజీపీ విచారణపై కోర్టు అసంతృప్తి:
నేరెళ్ల దళితులపై థర్డ్ ప్రయోగించిన ఘటనలో విచారణ జరుగుతున్న తీరుపై హైకోర్టు అసంతృప్తితో ఉంది. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ, ఎస్ఐలను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఘటనపై ప్రభుత్వం కూడా అప్పట్లో చాలా ఆలస్యంగా స్పందించి విమర్శలు మూటగట్టుకుంది.
ఇసుక మాఫియా సంగతేంటి:
నేరెళ్ల దళితులపై దాడి ఘటనలో అసలు నిజాలు బయటపడాలంటే సీబీఐ విచారణే కరెక్ట్ అని ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. డీజీపీ చేస్తున్న విచారణపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ ప్రయోగించిన ఘటనలో ఎస్పీ, ఎస్ఐలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. వారిపై క్రిమినల్ కేసులు ఆలస్యంగా నమోదు చేయడం పట్ల కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఎస్పీ, ఎస్ఐ ఏం చెప్తారో?:
ఎస్పీ,ఎస్ఐలు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత న్యాయస్థానం వాటిపై విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరు పిటిషన్ లో ఏం పేర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పు కౌంటర్ పిటిషన్ పై ఆధారపడి ఉండటంతో.. వారి వాదన న్యాయస్థానం ముందు నిలబడుతుందా.. లేదా అన్నది వేచి చూడాలి.