ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత
వరంగల్: మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో ఆయన జన్మించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1947లో పదహారేళ్లకే ఆయన తన కెరీర్ ప్రారంభించారు.
ఐక్యరాజ్య సమితిలో మిమిక్రి ప్రదర్శన చేసిన తొలి తెలుగు వ్యక్తి. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఏయూ, కేయూ, ఇగ్నోల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1978లో ఏయూ నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు. వరంగల్ కొత్తవాడలో ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, హిందీ, ఉర్దూల్లో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. చిలకమర్తి ప్రహసనాల్లో నటించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది.
మిమిక్రీ కళలో ఆయన ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. నేరెళ్ల ప్రతిభకు మెచ్చిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.. శివదర్పణం సంపుటిని అంకితం ఇచ్చారు. నేరెళ్లపై ఐవీ చలపతి రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ పుస్తకాలు రాశారు.
ప్రముఖ నిర్మాత బీఎన్ రెడ్డి ప్రోద్బలంతో సినిమాల్లో నటించారు నేరెళ్ల వేణుమాధవ్. దాదాపు పన్నెండు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పీవీ నర్సింహా రావు సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంగా నామకరణం చేశారు.