సినారే వెళ్లిపోయారు, ఇక మిగిలింది నేనే: నేరెళ్ల వేణు మాధవ్
సినారె కన్నుమూతతో తన మూడో సోదరుడిని కోల్పోయినట్లయిందని మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ అన్నారు.
వరంగల్: సుప్రసిద్ధ సాహిత్యకారుడు సినారె (సి నారాయణరెడ్డి) కన్నుమూతతో ఓరుగల్లు సాహిత్యలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆ మహాకవి స్మృతులను మననం చేసుకుంటూ ఆయనతో అనుబంధం వున్న వారు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన చివరిచూపు కోసం హైదరాబాద్కు తరలివెళ్లారు. శథాబ్దాలుగా సినారెతో ఓరుగల్లుకు ఎనలేని అనుబంధం వుంది.
ప్రజాకవి కాళోజీ మొదలు అనేక మంది సాహితీ ప్రముఖులు ఆయనతో ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకుని వున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది రచయితల పుస్తకాలకు ముందుమాటలు రాసి సినారె వారిని ఎంతగానో ప్రోత్సహించారు.
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్తో సినారె అనుబంధం ప్రగాఢమైనది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అచార్యుడిగా, అధికార భాష సంఘం అధ్యకక్షుడిగా, తెలుగు విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యుడిగా ఏ పదవిలో ఉన్నా సినారె వరంగల్కు లెక్కలేనన్ని సార్లు వచ్చి వెళ్లారు.
2002లో తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠానికి తన ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి రూ. 30 లక్షలను అందించారు. భవన నిర్మాణానికి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో వరంగల్తో ఉన్న అనుబంధం మాటలతో వర్ణించలేనని చెప్పుకున్నారు. తాను 10వ తరగతి పాసయ్యాక హైదరాబాద్కు పోయేందుకు 50 ఏళ్ల క్రితం వరంగల్కు వచ్చి కాజీపేటలో రైలెక్కిన సందర్భం జీవితంలో మర్చిపోలేనని చెప్పుకున్నారు.
ప్రజాకవి కాళోజీతో కలిసి అనేక వేదికలపై ఆయన పాలుపంచుకున్నారు. వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో శతాధిక కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కవులందరికి జ్ఞాపికలను బహూకరించి తీపి గుర్తులను శాశ్వతం చేశారు. 1995లో ఆనాటి ఆర్ఈసీలో కాకతీయ ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ, ఆనాటి మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ చేతులమీదుగా సినారె స్వయంగా పురస్కారాన్ని స్వీకరించిన సందర్భాన్ని అనేక మంది కళారంగ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
ఇక మిగిలింది నేనొక్కడినే: నేరెళ్ల వేణుమాధవ్
గత నాలుగు శథాబ్దాలుగా సినీ, సాహిత్య రంగంలో గుమ్మడి వెంకటేశ్వర్రావు, మిక్కిలిలేని రాధాకృష్ణమూర్తి. సి.నారాయణరెడ్డితోపాటు తనను ఇష్ట చతుష్టయంగా అభివర్ణించేవారని నగరానికి చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ చెప్పారు. తన సోదరులు ముగ్గురు తనను విడిచిపోయారని చివరకు ఇక తానొక్కన్నే మిగిలిపోయానని గద్గద స్వరంతో చెప్పారు. సినారె సోదరుడిని కోల్పోయిన వేళ తనకు మాటలు రావడంలేదని, అనేక వేదికల మీద పాలుపంచుకున్న తమ మధ్య ఉన్న అనుబంధం గొప్పదని పేర్కొన్నారు.