వైయస్ సీఎంగా..సజ్జనార్ ఎస్పీగా: వరంగల్ లో నాడు: అదే డిమాండ్ తో..ప్రియాంకకు మద్దతుగా..!
ప్రియాంక రెడ్డి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ప్రియాంకను నలుగురు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు అతి దారుణంగా అత్యాచారం చేసి..హత్య చేసి .. తగ లబెట్టి జీవితం లేకుండా చేసారు. ఆ కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చారు. ఈ సంఘటన మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరినీ కదిలించింది. తెలంగాణలోనే కాదు..తెలుగు రాష్ట్రాలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.
priyanka reddy murder..జాతీయ మహిళా కమిషన్ సభ్యుల విచారణ ప్రారంభం...ప్రియాంక తల్లిదండ్రులకు పరామర్శ
ప్రియాంక పైన కిరాతకంగా వ్యవహరించిన వారిని పోలీసులు అతి తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. అయినా..సరైన సమయంలో పోలీసులు స్పందించలేద నే విమర్శలు ఉన్నాయి. ఇక, ఇదే సమయంలో ప్రియాంకకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చిన వారు..సోషల్ మీడియా ద్వారా పోస్టింగ్ లు పెడుతున్న వారు గతంలో జరిగిన అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ హాయంలో..వరంగల్ లో జరిగిన ఒక సంఘటనలో అప్పుడు ఆ జిల్లా ఎస్పీగా సజ్జనార్ ఉన్న సమయంలో ఏం జరిగిందో..అదే సరైన తీర్పు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
వైయస్ సీఎంగా.. సజ్జనార్ ఎస్సీగా..
అది 2008 డిసెంబర్ 10. వరంగల్లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నస్వప్నిక తన న స్నహితురాలు ప్రణీతతో కలిసిన స్కూటర్పై ఇంటికి వెళుతుండగా శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేసాడు. ఈ దాడి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్లోని యశోదా అస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని స్వప్నిక మృతి చెందింది. తీవ్ర గాయాలతో ప్రణీత కు చికిత్స జరుగుతోంది. ఆ సమయంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ సమయంలో సీఎం గా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆ సమయంలో వరంగల్ ఎస్పీగా ప్రస్తుతం ప్రియాంక కేసు పర్యవేక్షిస్తున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వ్యవహరించారు. ఆ తరువాత ఇద్దరు విద్యార్ధునుల పైన యాసిడ్ దాడి.. ఒకరి మరణానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఎన్ కౌంటర్..ముగ్గురూ మృతి
యాసిడ్ దాడిలో స్పప్నిక మృతి చెందగా..ప్రణీత చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలోనే ఈ దాడిలో ప్రమేయం ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే, ఆ తరువాత వారు ఎన్ కౌంటర్ అయ్యారు. ఆ ముగ్గురులో దాడి చేసింది శ్రీనివాస్ కాగా..సహకరించింది సంజయ్...హరికృష్ణ. అయితే వారు ఎన్ కౌంటర్ అవ్వటానికి కారణాలను నాటి ఎస్పీ సజ్జనార్ వివరించారు. ఆత్మరక్షణ కోసమే వారి పైన కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. వారు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్ దాడి చేశారన్నారు. తాము నిందితులు చెట్లలో దాచిపెట్టిన ఆయుధాలను రికవరీ చేసుకునేందుకే నిందితులతో కలిసి వెళ్లామని ఆయన అన్నారు. వారు తమపై దాడికి దిగినందునే ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారని ఆయన అన్నారు. వారికి తుపాకులు ఎక్కడినుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తామని అన్నారు.చట్టం తనపని చేసుకుపోతుంది. తప్పితే ఇది కావాలని చేసిందికాదని ఎస్.పి. సమర్ధించుకున్నారు.
Recommended Video
ఇప్పుడు అదే సజ్జనార్..అదే డిమాండ్..
ఇక, ఇప్పుడు యాధ్రుచ్చికంగా ప్రియాంక రెడ్డి కేసు పర్యవేక్షణ చేస్తోందీ సైబరాబాద్ సీపీ సజ్జనార్. నాడు వరంగల్ లో ఏరకంగా అయితే యాసిడ్ దాడి ఒక విద్యార్ధిని మరణానికి కారణమైన ముగ్గురు ఏ విధంగా ఎన్ కౌంటర్ అయ్యారో..అదే విధంగా ఇప్పుడు ప్రియాంక రెడ్డిని చంచేసిన వారి పైన వ్యవహరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది మానహ హక్కుల ఉల్లంఘనే అయినా..నాడు వరంగల్ లో ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అప్పట్లోనే సజ్జనార్ చెప్పినా..ఇప్పుడు ప్రియాంక ఉదంతంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్న విద్యార్ధులు...నిరసన వ్యక్తం చేస్తున్న వారు మాత్రం ఆ నలుగురికి విచారణలు.. కోర్టులు కాదని..తమకు అప్పగించాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే రకమైన డిమాండ్లతో పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. అయితే, ఎన్ కౌంటర్ అనేది భాదలో వినిపిస్తున్న డిమాండ్ అని..అది సరైన విధానం కాదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి డిమాండ్లు చేయటం ద్వారా పోలీసుల మీద ఒత్తిడి ఏర్పడుతుందని వాదిస్తున్నారు. ఇక, ఇప్పుడు ప్రియాంక వ్యవహారంతో మరో సారి వైయస్సార్ ను నెటిజెన్లు గుర్తు చేస్తున్నారు.