ఆపద్బాంధవుడు.. ఆ కళ్లల్లో ఆనంద భాష్పాలు.. కేటీఆర్కు హ్యాట్సాఫ్ అంటున్న జనం..
కరోనా వైరస్.. ఇప్పటికే దాదాపుగా దేశం మొత్తాన్ని చుట్టేసింది. వేగంగా వ్యాప్తి చెందడానికి కాచుకుని ఉంది. ఇలాంటి తరుణంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా యావత్ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే లాక్ డౌన్లు ప్రకటించాయి. అయితే లాక్ డౌన్ల కారణంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నగరాల్లో చిక్కుకుపోయినవారు కొందరు.. డెలివరీకి సిద్దంగా ఉన్న మహిళలు కొందరు.. డయాలసిస్ పేషెంట్లు.. ఇలా వాళ్లంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎవరిని సంప్రదించాలో.. ఆపద నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సతమతమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వారందరికీ మంత్రి కేటీఆర్ పెద్ద దిక్కు అయ్యారనడంలో అతిశయోక్తి లేదు.
కేటీఆర్ సార్ అంటూ.. కుప్పలు తెప్పలుగా విజ్ఞప్తులు
తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో మంత్రి కేటీఆర్కు కుప్పలు తెప్పలుగా ట్విట్టర్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 'సార్.. మా ఆవిడకి రేపే డెలివరీ.. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వెహికల్స్ ఏమీ అందుబాటులో లేవు.','సార్.. హైదరాబాద్లో ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చి బంధువుల ఇంట్లో ఉండిపోయాం. వెళ్లిపోమని ఇప్పుడు వారు ఒత్తిడి తెస్తున్నారు.' 'సార్.. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనుల కోసం వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఇక్కడే చిక్కుకుపోయారు.. దయచేసి సాయం చేయగలరు..' ఇలా రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి కేటీఆర్ ట్విట్టర్కు విజ్ఞప్తులు నిరంతరాయంగా వస్తూనే ఉన్నాయి. ప్రతీ ట్వీట్కు కేటీఆర్ ఎంతో సంయమనంతో బదులిస్తూ.. ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కారం దిశగా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆపదకాలంలో ఎవరిని సంప్రదించాలో తెలియక.. కేటీఆర్కు ట్వీట్ చేయమని ఎవరో సలహా ఇస్తే.. వర్కౌట్ అవుతుందో కాదోనన్న సందేహంతో.. ఎంతోమంది ఆయనకు ట్వీట్ చేశారు. చివరకు ఆయన నుంచి వచ్చిన స్పందన చూసి వారంతా స్వాంతన పొందుతున్నారు.
ఓ సీనియర్ జర్నలిస్ట్ పోస్టు
ఫేస్బుక్లో బండారు శ్రీనివాస్ రావు అనే ఓ సీనియర్ జర్నలిస్ట్ తన అనుభవాన్ని పోస్టు రూపంలో పంచుకున్నారు.'ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు ఫోన్ చేసారు. వారి శ్రీమతికి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించాలి. భార్యాభర్తలు ఇరువురూ వృద్ధులు. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి మధ్యలో కరానా కర్ఫ్యూ. ఆయనకి కాళ్ళూ చేతులు ఆడక నాకు ఫోన్ చేశారు. నేను మాత్రం ఏం చేయగలను? ఆలిండియా రేడియో నుంచి రిటైర్ అయి ఇప్పటికి పుష్కరం గడిచింది. నా మాట ఎవరు వింటారు. అంచేత ఓ సలహా ఇచ్చాను. కేటీఆర్ గారికి ట్వీట్ లేదా వాట్సాప్ చేయండని. ఆయన అలాగే చేశారు.' అని సలహా ఇచ్చినట్టుగా చెప్పారు.
ఆ కళ్లల్లో ఆనంద భాష్పాలు..
'నిమిషం గడవక ముందే ‘Will take care' అని జవాబు వచ్చింది. మరి కాసేపట్లో కానుగుల శ్రీనివాస్ గారు అనే ఆయన వారికి ఫోన్ చేసి చిరునామా నోట్ చేసుకున్నారట. ఆ ముసలి దంపతుల ఆనందం ఇంతా అంతా కాదు. 'ముందు మీ సలహా విని తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నా. కానీ ఫోన్ వచ్చేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నా. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ప్రభుత్వ స్పందన అద్భుతం' అని ఫోనులో చెబుతున్నారాయన. కానీ ఆయన కంటి వెంట కారుతున్న ఆనంద భాష్పాలు ఆ మాటల్లో నాకు కనబడుతూనే వున్నాయి. సామాన్యులు కృతజ్ఞత తెలిపే విధానం ఇలాగే వుంటుంది.'నేనున్నాను' అని భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని వారెప్పుడు మరచిపోరు.' అంటూ ఆ జర్నలిస్ట్ తన ఫేస్ బుక్ పోస్టులో వివరించారు.
Recommended Video
హ్యాట్సాఫ్ అంటున్న జనం..
కరోనా కష్ట కాలంలో ఆపద్బాంధవుడిలా ఓపిగ్గా అందరి సమస్యలు వింటూ.. వాటి పరిష్కారానికి మార్గం చూపుతున్న కేటీఆర్కు ఎంతోమంది సామాన్యులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఒక్కసారి ఆయన ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తే గడిచిన 24 గంటల్లో.. ఆయన ఖాతా మొత్తం విజ్ఞప్తులతోనే నిండిపోయింది. అయినప్పటికీ సంయమనంతో ప్రజల బాధలను,కష్టాలను అర్థం చేసుకుని.. వారికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసాను కేటీఆర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఎంతోమంది కొనియాడుతున్నారు.