కేసీఆర్ కు, జిల్లా ప్రజలకు ఎప్పటికి దూరం కాను..!: ఆత్మపరిశీలన చేసుకోవాలన్న జితేందర్రెడ్డి..
మహబూబ్ నగర్/హైదరాబాద్ : తనకు ఎంపీ సీటు దక్కక పోవడం పై మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తనను సొంత తమ్ముడిగా చూసుకున్నారని, ఉన్నత స్థాయి అవకాశాలు కూడా కల్పించారని ఆయన అన్నారు. తన పేరు ప్రకటించకుండా వేరే వాళ్లకు ఇవ్వడం అనే అంశం పట్ల తన దగ్గర సమాధానం లేదన్నారు. ఇవ్వాల్టి వరకు మచ్చలేని రాజకీయం చేసానని చెప్పారు. తన మీద ఉన్న కొన్ని ఆరోపణలతో తనకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటున్నానని.
అయినప్పటికీ కేసీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. మా నాయకుడు ఏవిధంగా చెప్తే ఆ విధంగా కొనసాగుతానని అన్నారు. తన విషయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల జోక్యం చేసుకుని ఉండి ఉంటే అది ఆయన ఆత్మపరిశీలనకు వదిలిపెడుతున్నానని మంత్రి శ్రీనివాసగౌడ్ ని ఉద్దేశించి వాఖ్యానించారు. జిల్లా ప్రజలకు ఎప్పటికి దూరం కానని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా
జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ వరకు రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుమతులు సాధించామని చెప్పారు. సీటు వచ్చినా, రాకపోయినా ఎప్పుడు ప్రజల మధ్యలోనే వున్నాను. 2009 లో కేసీఆర్ మహబూబ్ నగర్ లో నిలబడాలి అనుకున్నప్పుడు సహకరించాను. తెలంగాణ వస్తుంది అని ఉద్యమంలో నాతో పాటు రావాలని సీఎం కేసీఆర్ చెప్పినపుడు చాలా సంతోషంగా కలిసి నడిచాను. తెలంగాణ సాధనలో నా భాగస్వామ్యం ఉంది. సీఎం కేసీఆర్ ఉన్నత స్థానంలో నన్ను ఉంచారు. మొట్టమొదటి ఫ్లోర్ లీడర్ గా తనకు మంచి అవకాశం ఇచ్చారని జితేందర్ రెడ్డి అన్నారు.