రోహిత్ పేరు పేర్కోలేదు: దత్తాత్రేయ ట్విస్ట్, మీ పిల్లలం కాదు.. స్మృతికి లేఖ
న్యూఢిల్లీ: తాను తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు లోకసభలో చెప్పారు. దత్తాత్రేయ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఆయన రోహిత్ వేముల మృతి విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.
హెచ్ఆర్డీకి తాను రాసిన లేఖలో రోహిత్ పేరు ప్రస్తావించలేదన్నారు. హెచ్సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో విపక్షాలు తనను లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదన్నారు.
తనపై దుష్ప్రచారం సరికాదన్నారు. బీసీలు, దళితుల తరపున తాను ఎన్నో పోరాటాలు చేశానని, తాను పేద కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. తాను ఏమిటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని చెప్పారు. అనసవరంగా తనమీద అభాండాలు సరికాదన్నారు. ఈ వివాదంలోకి తనను లాగవద్దన్నారు.
స్మృతి ఇరానికి విద్యార్థుల బహిరంగ లేఖ
ఇటీవల లోకసభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉద్వేగపూరిత ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ఏమీ తెలియని చిన్నపిల్లాడేమీ కాదని ఆమె అన్నారు. దానిపై జెఎన్యులోని కొందరు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకరు ఆమెకు ఓ బహిరంగ లేఖను రాశారు.
పార్లమెంటులో మీరిచ్చిన ప్రసంగం నేను విన్నానని, ఇక్కడ మీకు ఒకటి స్పష్టం చేయాలని అనుకుంటున్నానని, ఈ లేఖ ఓ చిన్న పిల్లాడి నుంచి తల్లిలాంటి మంత్రికి రాస్తున్నది కాదని, ఓ రాజకీయ వ్యక్తి, రాజకీయాల్లోనే ఉంటున్న మరొకరికి రాస్తున్నదని పేర్కొన్నాడు.
కేవలం విద్యార్హతల కారణంగానే వ్యక్తి గొప్పతనాన్ని లెక్కించలేమని కూడా నేను స్పష్టం చేయదలచుకున్నానని, అసలు ఈ లెక్కే తప్పు అన్నాడు. ఈ లేఖ రాసింది అనంత్ ప్రకాష్ అనే విద్యార్థి. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మీరు ఓ మహిళనని చెప్పుకుంటూ మరో మహిళపై అభాండాలు మోపుతున్నారని, ఎన్నో తరాలుగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశంలో ఓ దళిత మహిళ తన పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడితే, ఇప్పుడు మీరు ఆమె పిల్లలకు తండ్రి కులాన్ని ఆపాదించాలని చూస్తున్నారని ఆరోపించారు.
సహజ న్యాయం గురించి మీకు తెలియదా? అని ప్రశ్నించాడు. రోహిత్ తల్లి తనకు న్యాయం చేయాలని భిక్షాటన చేయడం లేదని, తనకు జరుగుతున్న అన్యాయం మరొకరికి జరగకూడదని మాత్రమే పోరాడుతున్నారని అతను లేఖలో పేర్కొన్నాడు.