చిల్లర కష్టాలకు తెర: తెలుగు రాష్ట్రాలకు కొత్త 500నోట్ల రాక నేడే
చిల్లర కష్టాలు బుధవారం నుంచి తీరేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేటి నుంచి రూ. 500 నోటు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఎందుకంటే.. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నాటి నుంచి చిల్లర కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకులలో ఇస్తున్న రూ. 2వేల నోటుకు చిల్లర దొరక్క కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కాగా, ఈ కష్టాలు బుధవారం నుంచి తీరేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేటి నుంచి రూ. 500 నోటు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2వేల నోటును విడుదల చేసిన ఆర్బీఐ.. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకు రూ. 500ల నోటును విడుదల చేయలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లో చిల్లర కోసం జనం నానా కష్టాలు పడుతున్నారు.
బ్యాంకుల్లో కూడా చిల్లర లేకపోవడంతో వారూ ఆందోళనలో ఉన్నారు. ఉన్న చిల్లరతో ఎలాగో అలా నెట్టుకు వస్తున్నామని, నవంబర్ 24వ తేదీ వరకే బ్యాంకులను నడపగలుగుతామని, తర్వాత పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్బీఐ అధికారులకు బ్యాంకు అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్తగా ముద్రించిన రూ. 500 కొత్త నోట్లను ఆగమేఘాలపై రెండు రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకుంది.
బుధవారం మధ్యాహ్నం తర్వాత ఏ సమయంలోనైనా కొత్త రూ. 500 నోట్లు పంపిస్తామని వీటిని తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా బ్యాంకు యాజమాన్యాలకు ఆర్బీఐ మంగళవారం సాయంత్రం వర్తమానం పంపింది. ప్రత్యేక విమానాల ద్వారా ఈ కొత్తనోట్లను హైదరాబాద్కు తరలిస్తున్నారు.
రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 400 కోట్ల విలువైన కొత్త రూ. 500 నోట్లు రిజర్వుబ్యాంకు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం కూడా హైదరాబాద్లోని రిజర్వుబ్యాంకుకు చేరనుంది. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకులకు ఈ కొత్త నోట్లు చేరుకోనున్నాయి.