ఉత్తరాయణ ఏకాదశినాడు తొలి అసెంబ్లీ: 18న కేబినెట్, రేవంత్ను ఓడించిన నరేందర్ సహా వీరికి ఛాన్స్?
హైదరాబాద్: ఈ నెల పదిహేడవ తేదీ నుంచి తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. కొత్త శాసన సభకు ప్రొటెం స్పీకర్గా చార్మినార్ నుంచి మజ్లిస్ నుంచి గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉంటారు. అంతకుముందే 16న సాయంత్రం ఐదు గంటలకు ఆయనతో రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 17న ఉదయం పదకొండున్నర గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది. నాలుగు రోజుల పాటు సభ ఉంటుంది.
చదవండి: 'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!
గత ఏడాది డిసెంబర్ నెల 11వ తేదీన ఫలితాలు రాగా, 13న కేసీఆర్ సీఎంగా, మహమూద్ అలీల మంత్రిగా ప్రమాణం చేశారు. మంచి రోజుల్లో శాసన సభ సమావేశాలు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. దీనికి అనుగుణంగా ఆయన తాజాగా తేదీలను ఖరారు చేశారు. తాత్కాలిక సభాపతి ప్రమాణ స్వీకారం దశమి రోజున, శాసన సభ సమావేశాలు ఏకాదశి రోజున జరిగేలా ముహూర్తం ఖరారు చేశారు. ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారని, ఆ స్పూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథి నాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించామని కేసీఆర్ పేర్కొన్నారు.
18న మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్
అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కావడంతో కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారనే చర్చ సాగుతోంది. అయితే, ఈ నెల 18వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుంది. ఎనిమిది మందికి తొలి విడతలో అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే రోజు పార్లమెంటరీ కార్యదర్శులను ఎంపిక చేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్ విస్తరణకు సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశముంది.
వీరిలో కొందరికి తొలి విడతలో కొందరికి అవకాశం
ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే ఖమ్మం నుంచి మినహా మిగతా జిల్లాల నుంచి అందరికీ ప్రాతినిథ్యం ఉండే అవకాశముంది. కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర రావు, రెడ్యా నాయక్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, రేఖా నాయక్, కొప్పుల ఈశ్వర్, ఆరూరి రమేష్, వినయ భాస్కర్, పట్నం నరేందర్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై కొడంగల్లో గెలిచారు.
మంత్రివర్గ విస్తరణ, స్పీకర్ ఎంపికపై కేసీఆర్ దృష్టి
17న అసెంబ్లీ సమావేశమవుతుంది, 19న గవర్నర్ సభను ఉద్దేశించి మాట్లాడతారు, 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో 18వ తేదీన మంత్రివర్గ విస్తరణకు అనుకూలమని భావిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో 16వ తేదీన కూడా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 16వ తేదీ లేదా 18వ తేదీల్లో విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఇక, సభాపతి ఎంపిక పైన కూడా కేసీఆర్ దృష్టి సారించారు. పోచారం, పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, రెడ్యా నాయక్, కొప్పుల ఈశ్వర్ తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సభాపతి ఎంపికపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.