పెళ్లైన కొత్తలోనే.. తగిన జోడీ కాదంటూ వేధింపులు: నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: భర్త తనకు తగిన వాడు కాదంటూ ఓ యువతి వివాహమైన రెండున్నర నెలలకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని హిల్టాప్ కాలనీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా పెబ్బెరు మండలం కంచర్లపల్లి తండాకు చెందిన మురావత్ సంధ్య అలియాస్ సుజాత(21)కు అదే జిల్లాకు చెందిన మల్విడి మండలంలోని నేలవీటి తండాకి చెందిన రాజు (23)తో ఈ యేడాది ఏప్రిల్ 16న పెద్దలు వివాహం జరిపించారు.
పెళ్లి సమయంలో వరకట్నంగా రూ. 4 లక్షలు అందించారు. కాగా, నెల రోజుల క్రితం బతుకు తెరువు కోసం భార్యా భర్తలిద్దరూ హైదరాబాద్ వచ్చారు. హిల్టాప్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కాగా, రాజు సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే తనకు తగిన జోడీ కాదని పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సుజాతను భర్త రాజు వేధించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. భర్త వేధింపులు ఎక్కువ కావటంతో సుజాత ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సెంట్రింగ్ పని ముగించుకుని ఇంటికి వచ్చిన రాజు తలుపులు కొట్టినా భార్య నుంచి స్పందన రాకపోవటంతో కిటికిలో నుంచి చూశాడు. ఉరేసుకుని వేలాడుతున్న మృతదేహం కన్పించింది. సుజాత మృతి చెందిందని గుర్తించిన రాజు పోలీసులకు సమాచారం అందించారు.
సుజాత ఆత్మహత్య గురించి ఆమె తల్లిదండ్రులకు ఇక్కడి బంధువులు చెప్పారు. అల్లుడి వేధింపులవల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి లక్ష్మణ్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి భర్త రాజునుఅదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.