పెద్దలు కాదన్నా ప్రేమ పెళ్లి: 4నెలలకే నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్, పద్మ(21) మూసాపేట జనతా నగర్లో నివసిస్తున్నారు. శంకర్ సెంట్రింగ్ పని చేస్తుండగా.. పద్మ స్థానికంగా గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారి వివాహానికి శంకర్ తల్లిదండ్రులు అంగీకరించగా..పద్మ తల్లిదండ్రులు నిరాకరించారు. కాగా, శంకర్ ఆమెను తీసుకుని నాలుగు నెలల క్రితం సొంతూరు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత, తిరిగి నగరానికి వచ్చి జనతానగర్లో కాపురం పెట్టారు. ఆదివారం బోనాలు కావడంతో శంకర్ బయటకు వెళ్లి సోమవారం ఉదయం ఇంటికొచ్చాడు. ఇంట్లోకెళ్లి చూడగా పద్మ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలి తల్లి చిన్నమ్మడు ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమార్తె మృతికి ఆమె భర్త శంకర్ కారణమని చిన్నమ్మడు తన ఫిర్యాదులో పేర్కొంది.